– ఈఎంసీ పరిధిలో మహా ర్యాలీ
– కదిలి వచ్చిన విద్యార్థులు, యువత, నిరుద్యోగులు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 05 : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు అండగా పార్టీ పోరుబాట చేపట్టింది. శనివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండ సెంటర్ నుండి వరంగల్ క్రాస్ రోడ్డు వరకు జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్లకార్డులు ధరించి, కాంగ్రెస్ ప్రభుత్వ యువత, విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో జెన్-జీలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కందాల మాట్లాడారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు రోడ్లెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో మాయ మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ దేనని, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు అధర్యపడవద్దని తాము అండగా ఉంటామన్నారు. యూత్ డిక్లరేషన్ అమలు చేసే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలయపాలెం మండలాల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, బాశపోయిన వీరన్న, నాయకులు పేరం వెంకటేశ్వర్లు, ముత్యం కృష్ణారావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

యూత్ డిక్లరేషన్ అమలు చేసే వరకు పోరాటం : మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి