ముదిగొండ, మార్చి 18 : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. సోమవారం ముదిగొండ మండలం వల్లభి శివారులో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్ల్లు పేర్కొన్నారు. జిల్లాలోకి ప్రవేశించే అన్ని రోడ్డు మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. సరైన ఆధారాలు చూపని నగదు, నగలు, ఇతరత్రా సొత్తును సీజ్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టీ, 15 ఎస్ఎస్టీ, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలూ నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
వైరారూరల్, మార్చి 18: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండలంలోని దాచాపురం గ్రామం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నెమలి గ్రామం సరిహద్దులో పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. చెక్పోస్ట్ వద్ద వైరా ఏసీపీ రెహమాన్, సీఐ సాగర్, పోలీస్ సిబ్బంది సోమవారం తనిఖీలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించి నగదు, మద్యం సరఫరా చేస్తే నిబంధన మేరకు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
సత్తుపల్లి, మార్చి 18: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసేందుకు మేమున్నామంటూ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు పట్టణంలో కవాతు నిర్వహించారు. సీఐ కిరణ్ మాట్లాడుతూ సీపీ సునీల్దత్ ఆదేశాలమేరకు ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు ఈ కవాతు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.