కారేపల్లి, నవంబర్ 28 : సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని కారేపల్లి ఎస్ఐ బి బి.గోపి హెచ్చరించారు. కారేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్పచారం చేసే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు, వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నటలు చెప్పారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు హాని కలిగించవద్దన్నారు.
ఏదైనా వర్గాన్ని కించపరిచేలా తెలియని సమాచారాన్ని పోస్ట్ చేయడం, షేర్ చేయడం నేరంగా పరిగణించ బడుతుందన్నారు. ఏ గ్రూపులోనైనా ఇలాంటి పోస్టులు షేర్ అయితే, ఆ గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యుడిగా పరిగణిస్తామని తెలిపారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. అనుచిత పోస్ట్ లు ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాలను సమాజానికి మంచిని చేకూర్చే విధంగా మాత్రమే ఉపయోగించుకోవాలని, నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.