తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురంగా నిర్వహించారు. ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన విద్యా దినోత్సవంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. వేడుకల్లో మంత్రితోపాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, కలెక్టర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్ పుస్తకాలు, రాగి జావ పంపిణీ చేశారు.
– ఖమ్మం, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):బీఆర్ఎస్ సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇందుకు ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమం మరింత దోహపడిందని, దీంతో సర్కారు బడులకు మహర్దశ పట్టినట్లయిందని స్పష్టం చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన విద్యాదినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘మన బడి’ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపునిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘మన బడి’ కార్యక్రమం కింద ఆధునీకరించిన పలు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి ప్రారంభించారు.
చదువుల పండుగ సందడి..
విద్యా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చదువుల పండుగ సందడి నెలకొంది. ఇప్పటికే ‘మన బడి’ కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలలను ఆధునీకరించించడంతో అవన్నీ కార్పొరేట్ స్కూళ్లను తలపించాయి. ఖమ్మంలో మంత్రితోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, కలెక్టర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్ పుస్తకాలు, రాగి జావ పంపిణీ చేశారు. కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, కల్లూరు మండలం ముచ్చవరం, పెనుబల్లి మండలం లంకపల్లి, చింతగూడెం గ్రామాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిర మండలం వంగవీడులో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, కొణిజర్ల ఉన్నత పాఠశాలలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్, అన్నపురెడ్డిపల్లిలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బూర్గంపహాడ్, కరకగూడెం మండలాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, టేకులపల్లిలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.