‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు.. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీయేనా? లేదా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీనా..? అనే అంశాన్ని తేల్చాలి..’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం-మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం’ పేరుతో చింతకాని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తుంటే.. ‘పంటలకు రోజుకు మూడు గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది..’ అని రేవంత్ అనడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పందించాలన్నారు.
– మధిర, జూలై 17
మధిర, జూలై 17: రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దారుణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అన్నదాతల పంటల సాగుకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం – మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం’ పేరుతో చింతకాని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. చంద్రబాబు ఏజెంట్గా ఉండి కాంగ్రెస్ను నడిపిస్తున్నారని విమర్శించారు. రేవంత్ చేసిన 3 గంటల విద్యుత్ వ్యాఖ్యలపై అన్నదాతలందరూ ఆగ్రహంతో ఉన్నారన్నారు.
వ్యవసాయానికి కావాల్సిన ప్రధానమైన విద్యుత్ను సీఎం కేసీఆర్ 24 గంటలూ ఉచితంగా అందించడం వల్లనే రాష్ట్ర రైతులు నేడు 30 లక్షల బోర్ల కింద మూడు పంటలూ పండిస్తున్నారని, తెలంగాణను అన్నపూర్ణగా చేశారని వివరించారు. దీనిని ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఉచిత విద్యుత్ వద్దంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని విద్యుత్ సంస్థల నుంచీ 7,800 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగా.. నేడు తెలంగాణ రాష్ట్రమే 18,000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఇస్తానంటున్న మూడు గంటల విద్యుత్ కావాలో, బీఆర్ఎస్ ఇస్తున్న 24 గంటల విద్యుత్ కావాలో అన్నదాతలు ఆలోచించాలని కోరారు. రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ నాయకులకు రైతులు కర్రు కాల్చి వాతలు పెట్టాలని పిలుపునిచ్చారు. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వ్యవసాయాన్ని దండగన్నారని, అయితే సీఎం కేసీఆర్ దానిని పండుగ చేసి చూపించారని అన్నారు.
రైతులు పండుగలా వ్యవసాయం చేయడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు ఊరుకో విధానాన్ని ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ లీడర్ కాదని.. ఎవరో రాసిచ్చింది చదివే రీడరని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదంటున్న కాంగ్రెస్ను రైతులందరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, నల్లమల వెంకటేశ్వరరావు, పునుకొల్లు నీరజ, బంధం శ్రీనివాసరావు, పూర్ణయ్య, మంకెన రమేశ్, తిరుపతి కిశోర్, బచ్చు విజయ్కుమార్, కొనుగోటి రత్నాకర్, బండి సుభద్ర, వంకాయలపాటి సత్యనారాయణ, గడ్డం శ్రీనివాసరావు, బొడ్డు వెంకటరామారావు, నూతలపాటి వెంకటేశ్వర్లు, తుల్లూరి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.