తల్లాడ, ఏప్రిల్ 21: రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు సూచించారు. పుష్కలమైన నీటి వనరులు, ఉచిత్ విద్యుత్ వల్ల ఖమ్మం జిల్లాలో అంచనాలకు మించి వరిసాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. మండలంలోని గంగిదేవిపాడు సొసైటీ పరిధిలోని రేజర్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో 5.37 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కావాల్సి ఉందని, దానిలో 4.03 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అంచనాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 230 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, అవసరాన్ని బట్టి ఇంకా కొనుగోలు కేంద్రాలను పెంచుతామని అన్నారు. డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు రాయల వెంకటశేషగిరిరావు, కూరాకుల నాగభూషణం, అదనపు కలెక్టర్ మధుసూదన్రావు, ఆర్డీవో సూర్యనారాయణ, డీసీఎస్వో రాజేందర్, జిల్లా మేనేజర్ సోములు, ఏడీఏ సునీత, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, తహసీల్దార్ గంటా శ్రీలత పాల్గొన్నారు.
‘మన ఊరు – మన బడి’లో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని నూతనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శుక్రవారం ఆయన పరిశీలించారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి పనులన్నింటినీ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ పాఠశాలలో రూ.29 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అనంతరం తల్లాడ ఉన్నత పాఠశాలలో జరుగుతున అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పీఆర్ ఏఈ సూర్యనారాయణ, డీఈ వైకుంఠచారి, ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంఈవో దామోదరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.