ఇల్లెందు రూరల్, మే 29: ఇల్లెందు నియోజకవర్గంలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని, త్వరలో ఖమ్మాన్ని మించిపోయేలా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే హరిప్రియ.. తన పదవికి పూర్తి న్యాయం చేశారని అన్నారు. ఇల్లెందు జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన చివరి ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ అహర్నిశలూ శ్రమిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్పైనా, ఎమ్మెల్యే హరిప్రియనాయక్పైనా విమర్శలు చేసే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. కోరం కనకయ్యను సీఎం కేసీఆర్ గౌరవించి అందలం ఎక్కిస్తే ఇప్పుడాయనే అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఖమ్మంలో తన మీదనే ప్రెస్మీట్ పెట్టి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కోరం కనకయ్యకు.. ధృతరాష్ర్టుడి కౌగిలి అంటే ఏమిటో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన డబ్బు మూటలకు అమ్ముడుపోయిన కోరం కనకయ్యకు ప్రజాక్షేత్రంలో ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరిప్రియ జోలికి వస్తే ప్రజలు, కార్యకర్తలే తిరగబడతారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధిస్తుందని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో గులాబీ గెలుపునకు అందరమూ కంకణబద్ధులమవుదామని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. సీఎం కేసీఆర్ ఓ వ్యక్తిని చేరదీసి అతడిడి అధికారమిస్తే ఇప్పుడు అతడే సీఎంపై విమర్శిస్తున్నారని అన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచే విధంగా ఆ వ్యక్తి వ్యవహరించడం ప్రజలందరికీ తెలుసని అన్నారు. ముందుగా కరెంటాఫీస్ నుంచి గోవింద్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కంచెర్ల చంద్రశేఖర్, డీసీసీబీ, మున్సిపల్, ఏఎంసీ, గ్రంథాలయ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, డీవీ, హరిసింగ్, దిండిగాల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్లు మాధవరావు, వైస్ చైర్మన్ జానీపాష, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు రంగనాథ్, నాదెండ్ల శ్రీనివాస్రావు, పరుచూరి వెంకటేశ్వరరావు, మనోహర్ తివారి తదితరులు పాల్గొన్నారు.