ఇల్లెందు, అక్టోబర్ 13: ఇల్లెందు గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడ ఎమ్మెల్యేగా హరిప్రియ గెలుపు ఖాయమని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇల్లెందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2014లో 63 సీట్లు, 2018లో 88 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలు మూడోసారీ బీఆర్ఎస్ను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో దివ్యాంగులకు రూ.4,016 పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజలూ కోరుతున్నారన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ విజన్తో ఇల్లెందు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.
నియోజకవర్గవ్యాప్తంగా ఇంటికి కనీసం ఇద్దరైనా పథకాల ద్వారా లబ్ధిపొందారన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా పోడు పట్టాలు అందుకున్నది ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అన్నారు. అందులోనూ ఇల్లెందు నియోజకవర్గంలో అత్యధికంగా 18 వేల మంది గిరిజనులు 56వేల ఎకరాలకు పట్టాలు పొందారన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే నియోజకవర్గంలోని 60వేల ఎకరాలకు పైగా సస్యశ్యామలమవుతాయన్నారు. ప్రస్తుత భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గత ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ అధిష్ఠానం ఆయనకు జడ్పీ చైర్మన్గా పదవి ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడు పార్టీని బయటకు వెళ్లారన్నారు. అతీ గతి లేని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలవుతున్నాయన్నారు.
ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేందుకు కార్యకర్తలు పనిచేయాలన్నారు. అనంతరం నవంబర్ 1న ఇల్లెందులో జరుగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో ఎంపీలు కవిత, వద్దిరాజు రవిచంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మహబుబాబాద్ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, బొమ్మర వరప్రసాద్, శీలం రమేశ్, లక్ష్మణ్నాయక్, మూల మధుకర్రెడ్డి, శివాజీ, ఉమాదేవి, అంతోటి అచ్చయ్య, తాతా గణేశ్, సత్యనారాయణ, జనగం కోటేశ్వరరావు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో ఏకతాటిపైకి నడిచి బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఇల్లెందు పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు నివాసంలో శుక్రవారం ఆమె రాజకీయ ఎత్తుగడలపై ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవితతో కలిసి సమాలోచనలు చేశారు. వారి వెంట జడ్పీ చైర్మన్ బిందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఉన్నారు.