భద్రాచలం, డిసెంబర్ 27 : నాలుగు ఐటీడీఏల పరిధిలో జోనల్ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకు కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం తన చాంబర్లో ఉమ్మడి జిల్లాలోని ఏటీడీవోలతో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న పోటీల్లో క్రీడాకారులకు అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా క్రీడా పోటీలకు సంబంధించిన మైదానాలు, కోర్టులను క్రీడాధికారులు పరిశీలించి మరమ్మతులు ఉన్నైట్లెతే బాగు చేయించాలన్నారు.
శాఖలవారీగా సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ క్రీడా పోటీలను సమర్థంగా నిర్వహించాలన్నారు. ఏమాత్రం అశ్రద్ధ వహించినా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందన్నారు. క్రీడల్లో పాల్గొనే బాలబాలికలకు, వారి వెంట వచ్చే లైజన్ ఆఫీసర్లు, పీఈటీలు, పీడీలకు సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. క్రీడాకారులకు ప్రత్యేక మెనూ అమలు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఏసీఎంవో రమణయ్య, క్రీడల అధికారి బీ.గోపాలరావు, ఏటీడీవోలు నర్సింహారావు, చంద్రమోహన్, జహీరుద్దీన్, రూపాదేవి, ఏఎస్వో వెంకటనారాయణ, నాగేశ్వరరావు, రాంబాబు, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.