ఖమ్మం, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇల్లాలు బాగుంటే ఆ ఇంటికి సౌభాగ్యలక్ష్మి నడిచివచ్చినట్లే.. ఆడబిడ్డ నవ్వుతూ ఇంట్లో తిరుగాడుతుంటే ఆ ఇల్లు ఆనంద నిలయమే.. ‘ఆమే’ మన జీవితాలకు ఆధారం.. ఆమె ఆకాశంలో సగమే కాదు.. అవని ‘ఆమే..’ ఆమె సంక్షేమానికి.. ఆమె అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తున్నది. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థికసాయం, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన మహిళలకు ఆసరా పింఛను, సొంత జాగా ఉన్న వారికి మహిళల పేరిట గృహలక్ష్మి ప్రొసీడింగ్ పత్రాలు, స్వయం ఉపాధికి రుణాలు అందిస్తున్నది. పట్టా ఉన్న ప్రతి మహిళా రైతుకు ‘రైతుబంధు’, ‘రైతుబీమా’ వర్తింపజేస్తున్నది. డబుల్ బెడ్ రూం ఇండ్లు, జీవో నంబర్ 58 పట్టాలనూ ఇల్లాలికే అప్పగిస్తున్నది. దళితబంధు పథకం ద్వారా ఎంతో మంది మహిళలూ యూనిట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. సొంతంగా వాటిని నడుపుకొంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి జై కొడుతున్నారు.. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళల అభ్యున్నతి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రతిష్ఠాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలు చేస్తున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధురాళ్లు, దివ్యాంగులైన మహిళలకు నెలనెలా ఆసరా పింఛను, సొంత జాగా ఉన్న వారికి మహిళల పేరిట గృహలక్ష్మి ప్రొసీడింగ్ పత్రాలు అందిస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను గృహిణులకే అప్పగిస్తున్నారు. దళితబంధు పథకం ద్వారా కూడా ఎంతో మంది మహిళలు యూనిట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. సొంతంగా వాటిని నడపుకొంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. స్త్రీనిధి, డ్వాక్రా రుణాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు చేయూతనిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో సుదీర్ఘకాలం నుంచి నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా 58 జీవో తీసుకువచ్చి పట్టాలు అందించారు. రైతుబంధు పథకంలో భాగంగా మహిళా రైతుల ఖాతాల్లోనూ ఏటా రెండు సీజన్లలో సొమ్ము జమ అవుతున్నది. పోడు చేసుకుంటున్న ఎంతో మంది మహిళా రైతులకూ పోడు పట్టాలు అందాయి. పట్టా పొందిన మహిళా రైతులందరికీ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింపజేస్తున్నది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పింఛన్లు, రుణాలు అందుకున్న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతోమంది మహిళలు లబ్ధిపొందుతున్నారు. సీఎం కేసీఆర్ తమను ఆదుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే తెలుసుకుందామా..!
ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాం..
మేం ఎకరా పోడు చేసుకుంటున్నాం. గతంలో మేం పోలీసు, ఫారెస్టు అధికారుల నుంచి దాడులను ఎదుర్కొన్నాం. భయం భయంగా వ్యవసాయం చేసేవాళ్లం. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో గిరిజనులందరికీ పోడు పట్టాలు వచ్చాయి. ఇప్పుడు ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాం.
– తాటి లక్ష్మీభాయి, పోడు రైతు, తుమ్మలచెరువు, అశ్వాపురం మండలం
దళితబంధుతో జీవితం బారింది..
మా కుటుంబానికి దళితబంధు వర్తింపజేసి సీఎం కేసీఆర్ దేవుడిగా మారారు. నాడు నేను రోజూ కూలికి వెళ్లి తీసుకున్న కూలీతో కుటుంబాన్ని వెళ్లదీసుకునేవాళ్లం. ఒక రోజు కూలి దొరికితే మరో రోజు కూలి దొరికేది కాదు. కుటుంబ పోషణ భారంగా ఉండేది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం గురించి తెలుసుకున్నాం. మా మండలం పైలట్ పథకం కింద ఎంపికైందని తెలిసి సంబురపడ్డాం. పథకంలో భాగంగా మేము రూ.10 లక్షల విలువైన టెంట్హౌస్ యూనిట్ మంజూరైంది. ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నది. మా కుమార్తె పెండ్లికి కల్యాణలక్ష్మి సొమ్ము కూడా అందింది. బతకడమే కష్టమనుకుంటున్న సమయంలో సీఎం కేసీఆర్ దేవుడిగా వచ్చి మాకు దళితబంధు యూనిట్ అందించారు. యూనిట్తో మా జీవితం మారింది.
– కమతం విజయనిర్మల, దళితబంధు లబ్ధిదారు, ప్రొద్దుటూరు, చింతకాని మండలం
దళితబంధు ఆదెరువైంది..
మా కుటుంబానికి దళితబంధు ఆదెరువుగా నిలిచింది. నా భర్త సుతారి పనికి, నేను కూలి పనులకు వెళ్లే దానిని. వచ్చిన అరకొర కూలీతో భార్యాభర్తలిద్దరం ఇద్దరు అమ్మాయిలు చదివించేవాళ్లం. మాకు దళితపథకంలో భాగంగా రూ.10 లక్షలు మంజూరయ్యాయి. అధికారులు మాకు వస్త్ర దుకాణం, బ్యూటీపార్లర్ యూనిట్లు మంజూరు చేశారు. నేను వస్త్ర దుకాణం, మా కుమార్తె బ్యూటీపార్లర్ నడుపుతున్నది. దళితబంధు పథకంతో మా లాంటి ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి.
– ముళ్లగిరి శ్యామల, దళితబంధు లబ్ధిదారు, ప్రొద్దుటూరు, చింతకాని మండలం
పింఛనే ఆధారం
గత ప్రభుత్వాల హయాంలో వృద్ధులకు ఎంత పింఛన్ వచ్చిందో యాదికి లేదు. తెలంగాణ వచ్చినంకనే పింఛను గురించి తెలిసింది. ప్రస్తుతం నాకు నెలకు రూ.2,016 పింఛను అందుతున్నది. పెన్షన్ వచ్చిన మొదటిరోజే నేను పోస్టాఫీసులో రూ.500 దాచుకుంటున్నాను. రూ.500 మందులకు వాడుతున్నాను. మిగిలిన రూ.వెయ్యి ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తున్నాను. నాకు పింఛనే ఆధారం. పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కే నేను ఓటు వేస్తాను.
-వాసం చిట్టెమ్మ, పింఛనుదారు, టేకులపల్లి
పోడు గోస తీరింది..
మేము ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవడంతో మా గోస తీరింది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. పోయాయి. కానీ ఎవరూ పోడు రైతుల సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. స్వరాష్ట్రం వచ్చాక పోడు రైతుల సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిచ్చింది. మాకున్న 5 ఎకరాలకు పోడు పట్టా అందింది. పట్టా రావడంతో మాకు రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తిస్తాయి.
– బాణావత్ నాగమ్మ, పోడు రైతు, అంజనాపురం, బూర్గంపహాడ్ మండలం
పథకాలు వర్తిస్తున్నాయి..
మేము ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నాం. గతంలో బిక్కుబిక్కుమంటూ సాగు చేశాం. మేం రెండెకరాల భూమిని సాగు చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుని రూపంలో వచ్చి మాకు పోడు పట్టాలిచ్చారు. మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఇక ఎవరికీ భయపడకుండా భూ యజమానులుగా వ్యవసాయం చేసుకుంటాం. మాకిప్పుడు ప్రభుత్వ పథకాలు వర్తిస్తున్నాయి. మొత్తానికి మా కోరిక నెరవేరింది.
– కాంతమ్మ, పోడు రైతు, టేకులచెరువు, బూర్గంపహాడ్ మండలం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
మాది నిరుపేద కుటుంబం. దంపతులిద్దరం కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాం. 12 ఏళ్ల నుంచి మేం రేకుల ఇంటిలోనే ఉంటున్నాం. చాలీ చాలని కూలితో బతుకుతున్నాం. మా చిరకాల కోరిక సొంత ఇల్లు కట్టుకోవడం. సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిసి మేము దరఖాస్తు చేసుకున్నాం. మాకు పథకం మంజూరైంది. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మాకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. దీంతో మా ఆనందానికి అవధుల్లేవు. మా కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్ ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– చీమల శ్రావణి దంపతులు, కోయగూడెం, టేకులపల్లి మండలం
నచ్చిన విధంగా ఇళ్లు కట్టుకోవచ్చు..
సీఎం కేసీఆర్ సార్ మాటంటే మాటే. జాగా ఉంటే చాలు ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని గతంలో ఎప్పుడో ప్రకటించిన హామీని నెరవేర్చారు. అన్నట్లుగానే గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు.మాకున్న జాగాకు మాకు పథకం మంజూరైంది. ఇటీవల మాకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందాయి. ఇప్పటివరకు ఎండకు వానకు తట్టుకుంటూ చాలీ చాలని ఇంట్లో ఉంటున్నాం. గృహలక్ష్మి సొమ్ము అందితే ఇక మేము స్లాబ్ వేసుకుంటాం. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకుంటాం.
– గుగులోత్ రాధిక, లబ్ధిదారు, శ్రీనగర్, లక్ష్మీదేవిపల్లి మండలం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
మేం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాం. మా ఇంటికి పట్టా ఇవ్వాలని గతంలో ఎంతో మందిని అడిగాం. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకోసం 58 జీవో తీసుకొచ్చి ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఇటీవల మేము ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నుంచి పట్టా తీసుకున్నాం. మా చిరకాల కోరిక నెరవేర్చినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– చేపలమడుగు ప్రియంవద, లబ్ధిదారు, గాంధీనగర్, సత్తుపల్లి
సీఎం కేసీఆర్ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు
నా భర్త ఎన్నో ఏళ్ల క్రితం మృతిచెందాడు. నేను ఆ పనీ ఈ పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పెంచుతున్నాను. వారి చదివిస్తున్నాను. నా కష్టాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత దళితబంధుకు నన్ను ఎంపిక చేసింది. రూ.10 లక్షల యూనిట్లో భాగంగా నేను కారేపల్లిలో భోజనం హోటల్ పెట్టాను. హోటల్ మంచిగా నడుస్తున్నది. కుటుంబం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నది. మా కుమార్తెను డిగ్రీ, కుమారుడిని ఇంటర్మీడియట్ చదివిస్తున్నాను. దళితబంధు పథకంతో మా కుటుంబం బాగుపడింది. సీఎం కేసీఆర్ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు.
– పప్పుల నిర్మల, దళితబంధు లబ్ధిదారు, కారేపల్లి
సీఎం కేసీఆర్ మేలును మరువలేం..
తెలంగాణ వచ్చాకే మా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికింది. సీఎం కేసీఆర్ చొరవతో పోడు రైతుల కల నెరవేరింది. గిరిజనులు పోడు చేస్తున్న క్రమంలోగతంలో మాపై దాడులు జరిగేవి. ఎంతో గోసపడ్డాం.సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని మాకు పోడు పట్టాలు అందించారు. దీంతో దాడుల నుంచి పోడు రైతులకు విముక్తి లభించింది. సీఎం కేసీఆర్ చేసిన మేలును పోడు రైతులు ఎన్నటికీ మరువలేరు. మేము ఏడెకరాలు పోడు చేస్తున్నాం. సదరు భూమికి మాకు పట్టా అందింది. రైతుబంధు అందుతున్నందుకు సంతోషంగా ఉంది.
– పోలెబోయిన చిన్నమ్మ, పోడు రైతు, అమరవరం, పినపాక మండలం
ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం..
దళితబంధు పథకంతో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడింది. నా భర్తకు టైలరింగ్ వచ్చు. ఆయన దర్జీ కూలీగా వెళ్లేవాడు. నేను ఇంట్లోనే చిన్న కిరాణా షాపు ఏర్పాటు చేసుకుని నడిపేదానిని. కూలి పని దొరికినప్పుడు ఆ పనికి వెళ్తాను. దళితబంధు పథకంలో భాగంగా మా కుటుంబా నికి కిరాణా షాపు యూనిట్ మంజూరైంది. షాపు ద్వారా నెల నెలా మేం మెరుగైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. వచ్చిన దాంట్లో కాస్త బ్యాంక్లో దాచుకుంటున్నాం. ప్రస్తుతం మా కుమార్తె గురుకులంలో పదోతరగతి చదువుతున్నది. భవిష్యత్లో ఆర్థికంగా ఎదుగుతామనే నమ్మకం మాకున్నది.
– ముళ్లగిరి రాణి, దళితబంధు లబ్ధిదారు, ప్రొద్దుటూరు, చింతకాని మండలం