కల్లూరు, ఏప్రిల్ 29: రాష్ట్రప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం రూ.3.40 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్టేడియాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడల్లో రాణించి రాష్ర్టానికి, దేశానికి కీర్తి, ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ప్రజలు అభివృద్ధి చేసిన వారిని, వారికి మంచి చేసిన వారికే మద్దతు ఇస్తారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కే విజయాన్ని కట్టబెడతారని అన్నారు. కులవృత్తులను గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తిదారుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల చెంతకు చేర్చాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. కల్లూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో నూతన బస్టాండ్ పనులు ప్రారంభిస్తామన్నారు. స్టేడియంలో అతిత్వరలో క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సమ్మర్ క్యాంప్లు ఏర్పాటు చేస్తామన్నారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. గతంలో ఇండోర్ స్టేడియాలు జిలాకేంద్రాలకే పరిమితం అయ్యేవన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రాలకూ చేరవ చేస్తున్నదన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇండోర్ స్టేడియం మంజూరు చేసిందన్నారు. కల్లూరులో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్లు నిర్వహించాలని డీఈవో, ఎంఈవోలకు ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్ గౌతమ్, ఎంపీలు టెన్నిస్, షటిల్, టేబుల్ టెన్నిస్ ఆడుతూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, సర్పంచ్ లక్కినేని రఘు, ముఖ్యనేతలు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, పాలెపు రామారావు, కాటంనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు, పెడకంటి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, ఇస్మాయిల్, కమ్లీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.