ఖమ్మం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వేంసూరు: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా చేయించుకునే సర్వేల్లోనూ బీఆర్ఎస్కు అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురంలో శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్, బీజేపీకి కలిపి కనీసం 20 సీైట్లెనా రాని పరిస్థితి నెలకొన్నదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మున్ముందు దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతారన్నారు.
యావత్ దేశం కేసీఆర్ పాలన కోరుకుంటున్నదన్నారు. ఇప్పటికే అనేక రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి చర్చిస్తున్నారన్నారు. అందుకు ఇటీవల మహారాష్ట్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలే నిదర్శనమన్నారు. రైతుబంధు, పంటలకు ఉచిత విద్యుత్, రైతుబీమా వంటి పథకాలను దేశంలోని రైతులంతా కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పేదల గురించి ఆలోచించిన ప్రభుత్వాలే లేవని, పేదలను కేవలం ఓటు బ్యాంకులు గానే నాటి నాయకులు భావించారన్నారు. ఆంధ్రా సరిహద్దులో పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆనందాన్నిచ్చిందన్నారు. హైదరాబాద్లో అభివృద్ధిని చూసి ఎంతోమంది అమెరికాలో ఉన్నట్లు ఆశ్చర్యానికి గురవుతున్నారన్నారు.
ఇదే విషయాన్ని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ఇటీవల ఓ సభలో చెప్పారని గుర్తుచేశారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు మేలు జరిగిందన్నారు. తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. రాష్ట్ర విభజనతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, ప్రజలకు నష్టమే జరుగుతుందని అవాకులు చెవాకులు పేలిన వారికి సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులతోనే సమాధానం చెప్పారన్నారు. ఆయన అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ దళితబంధు మాదిరిగానే రానున్న రోజుల్లో బీసీ బంధు కూడా అమలు చేస్తారన్నారు. త్వరలో ఖమ్మ జిల్లాలో పలుచోట్ల నీరా కేఫ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
గీత వృత్తిదారుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. వైన్షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పిస్తున్నదన్నారు. రాబోయే కాలంలో ఈ రిజర్వేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. రాష్ట్రంలో 17 వేల క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వీటిలో ఇప్పటికే 13,570 ప్రాంగణాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్నారన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ వాసు, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, వైస్ ఎంపీపీ దొడ్డా శ్రీలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనానికి రావడం ఆనందాన్నిచ్చింది.
– సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించనున్నది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పనిచేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నేను సహాయ సహకారాలు అందిస్తా. శక్తిమేరకు పనిచేస్తా. వేంసూరు మండలం కుంచపర్తిలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తాం. త్వరలో అంచనాలను సిద్ధం చేస్తాం.- రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి
సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమించి తెలంగాణను అభివృద్ధికి కేరాఫ్గా నిలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పా లన సాగిస్తున్నారు. బీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉంది. కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వచ్చే ఎన్నికల్లో పార్టీకి హ్యాట్రిక్ విజయం ఖాయం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. – ఎంపీ నామా నాగేశ్వరరావు
పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వాటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది. సాధించుకున్న రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దేశ రాజకీయాల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. యావత్ దేశ ప్రజలు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కోసం చేస్తున్నారు. కేసీఆర్ వంటి నేత మనకు ముఖ్యమంత్రి కావడం అదృష్టం. బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను జీర్ణించుకోలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుతంత్రాలు పన్నుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు పార్టీని మరింత బలోపేతం చేయాలి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి.
– రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర