భద్రాచలం, ఏప్రిల్14: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక జీయర్ మఠంలో గరుడ ధ్వజపట లేఖనం కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉదయం ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం భూతద్దంతో అగ్ని ప్రతిష్ఠను నిర్వహించారు. మధ్యాహ్నాం జీయర్ మ ఠానికి వెళ్లి తెల్లని వస్త్రంపై గరుత్మంతుడి చిత్రపటాన్ని చిత్రీకరించి, ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం గరుడ ధ్వజ పటాన్ని ధ్వజ స్థంభానికి ధ్వజారోహణం చేస్తారు. గరుడ ధ్వజ పటానికి హారతులు సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి, దేవనాధ రామానుజ జీయర్ స్వామి, దేవస్థానం ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఉప ప్రధానార్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీ కృష్ణమాచార్యులు, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుః స్తానార్చన జరుపనున్నారు. గరుడ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజారోహణం చేయనున్నారు. అనంతరం సంతానం లేని మహిళలకు గరుడ ముద్దలను పంపిణీ చేస్తారు. సాయంత్రం భేరీ తాడనం, దేవతాహ్వానం, బలిహరణం, హనుమత్ వాహనంపై స్వామివారికి తిరువీథి సేవను తాతగుడి సెంటర్ వరకు జరుపనున్నారు.