భద్రాచలం, ఏప్రిల్ 22 : వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో ధ్వజారోహణం తర్వాత(8వ రోజు సందర్భంగా) నూతన దంపతులైన రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి సోమవారం వసంతోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం బేడా మండపంలో జలద్రోణి ఉత్సవం చేపట్టారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ సీతమ్మను, రామయ్యను ఎదురెదురుగా కూర్చోబెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారు.
తర్వాత ఒక కలశంలో వసంతున్ని ఆవాహనం చేసి బుక్కా గులాల్, అత్తరు, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలను వేసి మూలవరుల వద్ద స్వామివారి అనుజ్ఞ తీసుకొని బేడా మండపానికి వచ్చి ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యాహవాచన జరిపారు. స్వామివారి, అమ్మవారి శిరస్సుపై పసుపు ముద్దలను ఉంచి అభిషేకం చేసిన తర్వాత మహాకుంభంలోని వసంతాన్ని అంతరాలయంలోని మూలవరుల శిరస్సుపై చల్లారు. మళ్లీ బేడా మండపానికి తీసుకొచ్చి అర్చకులు, ఆలయ సిబ్బంది, మతపర సిబ్బందిపై, భక్తులపై ప్రోక్షణ చేశారు. ఆ తర్వాత స్వామివారిని చలువ చప్పరం వాహనంపై ఆసీనులను చేసి తాతగుడి సెంటర్, ముదిరాజ్ బజార్, పాత ఎల్ఎఫ్ స్కూల్ మీదుగా అంబాసత్రం, బ్రాహ్మణ వీధి గుండా తిరువీధి సేవ జరిపారు. రాత్రికి స్వామివారికి సింహప్రభ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు.
నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి మంగళవారం చక్రతీర్థం నిర్వహించనున్నారు. సాయంత్రం పూర్ణాహుతి, ధ్వజారోహణం, ద్వాదశ ప్రదక్షిణలు చేపట్టనున్నారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. బుధవారం నుంచి స్వామివారికి నిత్య కల్యాణాలు, ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయని, భక్తులు గమనించాలని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి తెలిపారు.