ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 26 : పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంలో భాగంగా కోడింగ్ ప్రక్రియ షురువైంది. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ కేంద్రంగా స్పాట్కి సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తి చేస్తున్నారు. జిల్లాకు 2.10 లక్షల సమాధాన పత్రాలను కేటాయించనుండగా.. ఇతర జిల్లాలకు చెందిన పేపర్లు స్పాట్కు చేరుకుంటున్నాయి. వీటిని ఇద్దరు సీనియర్ హెచ్ఎంల పర్యవేక్షణలో సోమవారం నుంచి కోడింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు స్పాట్ జరగనున్నది.
సమాధాన పత్రాల మూల్యాంకనంలో భాగంగా అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లకు సంబంధించి విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతిక, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ల వారీగా స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లను అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా నియమించారు. అన్ని సబ్జెక్ట్ల కంటే గణితం, సోషల్లో అత్యధికంగా ఏఈలను నియమించారు. మండలాలవారీగా సీఈలు, ఏఈల ఉత్తర్వులను ఎంఈవోలకు అందజేశారు. ఎంఈవోల ద్వారా ఉపాధ్యాయులకు అందిస్తున్నారు. స్పాట్లో సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసేందుకు విద్యాశాఖ నుంచి అన్ని పాఠశాలల్లోని అర్హత కలిగిన ఉపాధ్యాయులకు ఉత్తర్వులు అందజేశారు. ఏటా మాదిరిగానే ఈ విద్యాసంవత్సరం కొందరు ఉపాధ్యాయులు తమ ఉత్తర్వులు క్యాన్సిలేషన్ కొరకు తమకున్న పరిచయాల ద్వారా పైరవీలు చేస్తున్నారు. క్యాన్సిలేషన్కు దరఖాస్తు చేసుకునే వారిలో ఎక్కువగా ఆరోగ్యం సహకరించడం లేదంటూ వైద్యుల నుంచి మెడికల్ సర్టిఫికెట్ పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది.
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఉన్నప్పటికీ జేడీ సర్వీసెస్, జిల్లా అబ్జర్వర్ మదన్మోహన్, డీఈవో సోమశేఖర శర్మలు స్పాట్ కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. పేపర్లు ఎలా భద్రపరచాలి, ఏయే గదుల్లో ఏయే సబ్జెక్ట్లకు కేటాయించాలనే అంశాలపై చర్చించారు. మూల్యాంకనంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. పాఠశాల నిర్వహణలో ఉన్నప్పటికీ స్పాట్కి ఎలాంటి ఆటంకాలు రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్పాట్కి ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తున్నారు. డీఈవో క్యాంపు ఆఫీసర్గా వ్యవహరించనున్నారు.