భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధికార యంత్రాం గం ఎన్నికల నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఓటరు జాబితాను రూపొందించడంతోపాటు వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొండరెడ్లు కేవలం అశ్వారావుపేట నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉండడంతో వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కొండరెడ్ల గ్రామాలపై కలెక్టర్ ప్రియాంక ఆల ప్రత్యేక దృష్టి సారించి.. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్కుమార్ కలెక్టర్ను అభినందించారు.
అక్కడ ఓటు హక్కుపై అవగాహన
జిల్లాలోని ఒకే నియోజకవర్గంలో ఉన్న 8 కొండరెడ్ల గ్రామాల్లో 692 మందికి ఓటు హక్కు వినియోగింపై అవగాహన కల్పించారు. గండ్లగూడెం 80, సుదగోగులగూడెం 63, నడిమిరెడ్డిగూడెం 33, బండారిగుంపు 55, రెడ్డిగూడెం 238, తిరుమలకుంట 54, గోగులపూడి 85, పూసుకుంటలో 84 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం దగ్గర్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
80 ఏళ్లు పైబడిన వారికి వెసులుబాటు
ఈసారి ఎన్నికల కమిషన్ వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. జిల్లావ్యాప్తంగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు 13,082 మంది ఉండగా.. వారిలో కదల్లేని స్థితిలో ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. ఎన్నికలకు వారం రోజుల ముందుగా వారికి 12డీ ఫారం ఇచ్చి.. మొబైల్ టీం పరిశీలించిన తర్వాత ఓటు హక్కుకు అవకాశం కల్పిస్తారు. ఎలాంటి అభ్యంతరాలు లేని వారిని గుర్తించి ఎన్నికల అధికారుల బృందం అక్కడకు వెళ్లి ఓటు వేసే కార్యక్రమాన్ని చేపడుతుంది. దీంతో వందకు వంద శాతం ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది.
మోడల్ పోలింగ్ కేంద్రాలు
గతంలో కేవలం మహిళలు, వికలాంగులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ.. ఈసారి యువతకు కూడా మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గానికి ఒక కేంద్రాన్ని మోడల్గా చేయనున్నారు. జిల్లాలో కొత్త ఓటర్లు 22,096 మంది ఉన్నట్లు గుర్తించారు. యువత ఓటర్లు కూడా కీలకం కావడంతో వారికి ఓటు హక్కు వినియోగంపై విద్యాసంస్థల్లో అవగాహన కల్పించారు.
క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా
జిల్లావ్యాప్తంగా 1,095 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 282 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను అందుబాటులో ఉం చారు. వెబ్ కాస్టింగ్తోపాటు వీడియా చిత్రీకరణ చేపట్టనున్నారు. మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గిరిజనులు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఇప్పటికే అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టారు.
కొండరెడ్లకు అవగాహన కల్పించాం
అశ్వారావుపేట నియోజకవర్గంలోని 8 కొండరెడ్ల గ్రామాల్లో 692 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్త ఓటర్లను సైతం చేర్పించాం. గతంలో ఎలా ఉన్నా.. ఈసారి అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాం. మహిళా పోలింగ్ కేంద్రాలతోపాటు వృద్ధులకు కూడా ప్రత్యేక కేంద్రాలు అందుబాటులో ఉంటాయి.
– రాంబాబు, అదనపు కలెక్టర్
వృద్ధులకు ఇంటి నుంచే ఓటు
80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఈసారి ఎన్నికల నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. గోడలపై, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలు లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.
– ప్రియాంక ఆల, కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం