ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
జిల్లాలో 50 పాఠశాలలు ఎంపిక
అంబాసిడర్లుగా స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు
శిక్షణ ఇస్తున్న విద్య, పోలీస్శాఖాధికారులు
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 5 ;నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. సాంకేతికత మారిన కొద్దీ నేరస్తులు అప్డేట్ అవుతున్నారు.. స్మార్ట్ఫోన్, ల్యాప్ టాప్ను వినియోగిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.. ఈమెయిల్, ఫోన్ నంబర్, పాస్వర్డ్స్ను హ్యాక్ చేస్తున్నారు.. అమాయకుల తెలియనితనాన్ని ఆసరా చేసుకుని లక్షలకు లక్షలు లూటీ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో పోలీస్శాఖ కూడా తన పరిధులను విస్తరించుకుంటున్నది.. ‘సైబర్ క్రైం’ విభాగాన్ని పటిష్టం చేస్తున్నది.. దీనిలో భాగంగా విద్యాశాఖ సహకారంతో ‘సర్కారు బడుల్లో సైబర్ కాంగ్రెస్’ అనే వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అంబాసిడర్లుగా విద్యార్థులను ఎంపిక చేసింది.. ఈ కార్యక్రమంపై ప్రత్యేక కథనం.
పాఠాలు నేర్చుకునే పద్ధతి బ్లాక్ బోర్డు నుంచి స్మార్ట్ ఫోన్కు మారింది.. నేరాలు కూడా తమ రూపాన్ని ఆన్లైన్లోకి మార్చుకున్నాయి.. ప్రస్తుతం సమాజంలో వేగంగా వస్తున్న మార్పులతో అన్నింటికీ ఫోన్నే ఉపయోగిస్తున్నాం. అవసరమున్నా, లేకపోయినా ఫోన్ చేతుల్లో ఉండాల్సిందే.. ఈ నేపథ్యంలో ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా పొందే సేవల వలన తెలిసీ తెలియక అనేక మంది సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంట్లో దొంగతనం జరిగితే పోలీస్ వాళ్లకి సమాచారం ఇస్తాం.. ఆన్లైన్లో దొంగతనం జరిగితే ఎలా? ఆన్లైన్లో సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి అనే అంశాలపై ‘సర్కారు బడుల్లో సైబర్ కాంగ్రెస్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యా, పోలీస్శాఖాధికారులు సంయుక్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల ప్రలోభాలను గుర్తించేలా..
సైబర్ నేరగాళ్ల నుంచి పాఠశాల స్థాయి విద్యార్థులను రక్షించడానికి సైబర్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్లో ఉన్న విద్యార్థులను సైబర్ నేరగాళ్లు ప్రలోభాలకు గురిచేసి నగదు దోచుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ, విద్యాశాఖ సమన్వయంతో అవగాహన కల్పిస్తున్నారు. ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేసేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు. అపరిచితుల ఫోన్లకు స్పందించకుండా, వారు చెబుతున్న మాటలు నమ్మి బ్యాంక్ వివరాలు, తల్లిదండ్రులకు సంబంధించిన ఏటీఎం పిన్ నంబర్లు చెప్పకూడదని వివరిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలను ఊదాహరణలతో సహా విద్యార్థులకు వివరిస్తున్నారు.
థింక్(THINK) సూత్రం…
సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లకు స్పందించే సమయంలో, ఇతరులకు చేరవేసే సందర్భంగా ‘థింక్’ సూత్రాన్ని అమలు పర్చాలి. THINK లో ‘టీ’ అంటే ‘ట్రూ’..ఈ సమాచారం నిజమైనదేనా..
హెచ్-హెల్ప్ఫుల్. ఈ సమాచారం ఉపయోగకరమైనదేనా..
ఐ-ఇన్స్పిరేషనల్. ఈ సమాచారంలో స్ఫూర్తిదాయకమైనదేనా..
ఎన్-నెసెస్సరీ. ఈ సమాచారం పంపడం అవసరమేనా.
కె-కైండ్. ఈ సమాచారం దయతో కూడినదేనా లేక ఇతరులను నొప్పించే విధంగా ఉందా.. అనేది పరిశీలించాలి. ఏ సమాచారమైనా థింక్లో ఉన్న ఐదు ఫిల్టర్లు దాటితేనే ఇతరులకు షేర్ చేయాలి.
విద్యార్థులకే ఎందుకు…?
కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధనకు బదులు స్మార్ట్ఫోన్, కంప్యూటర్ ద్వారా విద్య అభ్యసించారు. ఈ సమయంలో విద్యతోపాటు ఆన్లైన్ ద్వారా వాట్సాప్, ఫేస్బుక్ ఉపయోగించడం ద్వారా కొన్ని సోషల్ సైటుల్లో కనిపించే వాటిపై క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని నగదు పోగొట్టుకున్నారు. పాఠశాల స్థాయిలో సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి సైబర్ కాంగ్రెస్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రతి జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేసి, ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా ఎంపిక చేసి వారికి ఒక మెంటర్ టీచర్ పర్యవేక్షణలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాలను వినియోగించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాచార భద్రత, బాలికల హింస, నైతికత దెబ్బతీసే వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు, షీ టీమ్స్ను ఉపయోగించుకోవడం ద్వారా నేరాల కట్టడిపై అవగాహన ఉంటుంది. శిక్షణ అనంతరం విద్యార్థులు మిగిలిన విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
విద్యార్థుల ఎంపిక ఇలా..
తరగతి గదిలో చురుగ్గా ఉండి, అందరితో మాట్లాడగలిగే నైపుణ్యం కలిగి, తమకు తెలిసిన సమాచారాన్ని ఇతర విద్యార్థులకు స్పష్టంగా వివరించే లక్షణాలు కలిగిన ఒక బాలిక, ఒక బాలుడిని ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10వ తరగతులు చదువుతున్న వారికి ప్రాధాన్యత ఇచ్చారు. వారితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ప్రతి నెలలో రెండు మూడు టాస్క్లు ఇస్తే, వాటిని ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఆన్లైన్లో జూమ్ లింక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. విద్యాశాఖ, పోలీస్, యంగీస్తాన్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమం అమలు జరుగుతున్నది. తరుచూ సర్వేలతో విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. అందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తున్నారు.
విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
సెల్ఫోన్ వినియోగం పెరుగుతున్న తరుణంలో సైబర్ కాంగ్రెస్ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగపడుతుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలియకుండానే నగదు పోగొట్టుకుంటున్న సంఘటనలు విద్యార్థులకు అర్థమయ్యేలా వివరిస్తున్నాం.
-ఉదయ్శ్రీ, సైబర్ కాంగ్రెస్ నోడల్ అధికారి