మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే తెలంగాణ పురోగమిస్తోందని వక్తలు పేర్కొన్నారు. ఆయన అందించిన ఆదర్శంతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని అన్నారు. సామాజిక ఉద్యమకారుడు, మహిళోద్ధారకుడు జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వ్వవస్థ నిర్మూలన, మహిళోద్ధరణ కోసం పూలే చేసిన ఉద్యమం చిరస్మరణీయమైనదని అన్నారు. కాగా, పూలే జయంతి అధికారిక కార్యక్రమమైనందున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అలాగే బీఆర్ఎస్ నేతలు సహా వివిధ సంఘాల నాయకులు పూలే ఫ్లెక్సీలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. ఖమ్మంలోని పూలే విగ్రహానికి ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ, సుడా, డీసీసీబీ చైర్మన్లు కమల్రాజు, విజయ్కుమార్, నాగభూషణం, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు, మేయర్ నీరజ, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెంలో కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొని పూలే చిత్రపటాలకు పూలమాలలు వేశారు. -నమస్తే నెట్వర్క్