ఈ ఏడాది వరుణుడు కరుణించడంతో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. రైతులు రెండు పంటలు పండించుకునేలా నీటి వనరులు సమకూరాయి. చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుండడంతో సాగు సస్యశ్యామలం కానున్నది. యాసంగికి జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 2.54 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. 17 మండలాల్లో ఆయకట్టుకు 21.50 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. వారబందీ పద్ధతిలో 2023 మార్చి 31 వరకు ఎనిమిది విడతలుగా 87 రోజులపాటు సాగర్ ఆయకట్టు నీటిని విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం క్రైం, నవంబర్ 23 : ప్లాంటేషన్లో పశువులను మేపుతున్న గొత్తికోయలను ఫారెస్టు రేంజర్ శ్రీనివాసరావు తన సెల్ఫోన్లో చిత్రీకరించడంతో కోపోద్రిక్తులై వేట కొడవళ్లతో నరికి చంపారని భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు. బుధవారం కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కేసు నిందితులను చూపిస్తూ కేసు వివరాలను వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. చండ్రుగొండ మండలం పోకలగూడెం ఫారెస్ట్ బీటు పరిధిలో జరుగుతున్న ప్లాంటేషన్ పనులను పరిశీలించేందుకు మంగళవారం ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు వెళ్లారు. అక్కడి నుంచి బెండాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు గొత్తికోయ గుంపునకు దగ్గరలోని ప్లాంటేషన్లో కొందరు పశువులను మేపుతున్నట్లు సదరు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. దీంతో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు, ఎఫ్ఎస్వో తేజావత్ రామారావు తమ ద్విచక్రవాహనంపై సుమారు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అక్కడికి వెళ్లారు.
అదే సమయంలో అక్కడ ఎర్రబోడు గొత్తికోయ గుంపునకు చెందిన మడకం తులా, పొడియం నంగా ఆ ప్రాంతంలో తమ పశువులను మేపుతున్నారు. ఇది గమనించిన సదరు అధికారులు మొక్కలు నాశనమవుతున్నాయని, పశువులను పక్కకు తీసుకువెళ్లి మేపుకోమని చెప్పారు. వారు వినకపోవడంతో ఆ దృశ్యాలను రేంజర్ శ్రీనివాసరావు తన సెల్ఫోన్లో చిత్రీకరించడం ప్రారంభించారు.
దీంతో కోపోద్రేకానికి లోనైన తులా, నంగా ఎఫ్ఎస్వో రామారావుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రేంజర్ శ్రీనివాసరావుపై గొత్తికోయలు ‘మా వీడియోలు తీస్తావా’ అంటూ ప్రతీకారంతో తమతో తెచ్చుకున్న వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికారు. ఆ దాడిని ప్రత్యక్షంగా చూసిన రామారావు వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పై అధికారులను సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఫారెస్ట్ అధికారులు రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాసరావుని కారులో చండ్రుగొండ పీహెచ్సీకి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంలోని కిమ్స్ని తరలించారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు చండ్రుగొండ పోలీసులు నిందితులపై 302, 353, 332 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు తులా, నంగా పోలీసుల కన్నుగప్పి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో గల తమ స్వగ్రామానికి పారిపోతున్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది.
దీంతో జూలూరుపాడు సీఐ వసంత్కుమార్ తన సిబ్బందితో కలిసి ఎర్రబోడు శివారులోని సీతారామ కాలువకట్ట వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి హత్య సమయంలో ధరించిన దుస్తులతోపాటు, దాడికి వినియోగించిన వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను జుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచి కేసుని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వరబాబు, జూలూరుపాడు సీఐ వసంత్కుమార్, చండ్రుగొండ ఎస్సై విజయలక్ష్మి, పీఆర్వో దాములూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఘటనా స్థలంలో సీఐ విచారణ..
చండ్రుగొండ, నవంబర్ 23 : అటవీశాఖ రేంజర్ శ్రీనివాసరావు హత్యపై పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. బుధవారం బెండాలపాడు శివారులో హత్య జరిగిన అటవీ ప్రాంతం(ప్లాంటేషన్)లో జూలూరుపాడు సీఐ వసంత్కుమార్ విచారణ జరిపారు. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించి, వీడియో చిత్రీకరణ, ఫొటోలు తీయించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? ఆయుధాలు ఏమీ ఉపయోగించారు? హత్యకు గల ప్రధాన కారణం? మావోయిస్టుల పాత్ర ఏమైనా ఉందా? అనే విషయాలను ఆరా తీసినట్లు సమాచారం.