కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 19 : పోక్సో, లైంగిక దాడుల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో భరోసా సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోక్సో కేసుల దర్యాప్తు, విచారణ విషయంలో శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే సమావేశం ముఖ్యోద్దేశమన్నారు. ఇటీవల ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోక్సో, లైంగిక దాడి చట్టాలు, శిక్షల అమలు, భవిష్యత్ జీవితంపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు.
ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో బాలురకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి కేసులను తగ్గించడం మాత్రమే కాకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయని వివరించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి బి.రాజేందర్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, కొత్తగూడెం డీఎస్పీ లింగనబోయిన అదినారాయణ, రీజినల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రసాద్, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి స్వర్ణలత, డీఈవో నాగలక్షి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రాము, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.