కొత్తగూడెం క్రైం, మార్చి 23 : పార్లమెంట్ ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీస్ అధికారులతో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో సమస్యాత్మక వ్యక్తుల, రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్లు, మట్కా నిర్వహించే వారిపై నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేస్తూ.. చెక్పోస్టులలో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.
సరైనా అధారాలు లేకుండా పరిమితికి మించి నగదును తీసుకెళ్తూ పట్టుబడితే ఎన్నికల నియమావళి ప్రకారం కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిత్యం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా హాట్ స్పాట్స్ను గుర్తించి గంజాయి రవాణా చేసే వ్యక్తులతోపాటు సేవించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటిప్పుడు అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు విస్తృతంగా నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉంచాలన్నారు. ప్రతి ఠాణా పరిధిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాన్ని (బ్లాక్ స్పాట్స్) గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ సింగ్, కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీశ్కుమార్, ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను, మణుగూరు డీఎస్పీ వి.రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.