పల్లె, పట్టణాల్లో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు 40 శాతం రాయితీతోపాటు రుణ సహాయం చేసి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చేయూతనిస్తోంది. ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనాలు, అందించే రుణ రాయితీలపై గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు స్త్రీనిధి సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, సత్తుపల్లి, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలతోపాటు ఖమ్మం, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. ఒక్కో మండలం, మున్సిపల్ వార్డుల్లో 35 చొప్పున యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 315 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి.
సత్తుపల్లి, ఫిబ్రవరి 27: పల్లెల్లోనూ సౌర కాంతులను నింపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామాల్లో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడంతోపాటు దానిని స్థానిక అవసరాలకు వినియోగించుకోవడం, మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేయడం వంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం తొలుత స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తోంది. ప్లాంట్ల ఏర్పాటు కోసం 40 శాతం సబ్సిడీని ఇవ్వనుంది. దీనిని స్త్రీనిధి ద్వారా రుణంగా అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. సౌర కాంతుల లక్ష్యం అమలు కోసం ఖమ్మం జిల్లాలోని ఆరు మండలాలు, మూడు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. వాటిల్లోని మండలాలు, మున్సిపల్ వార్డుల్లో కలిపి 315 యూనిట్లను ఏర్పాటు చేయనున్నది.
మహిళా సంఘాలకు 40 శాతం రాయితీతోపాటు రుణ సహాయం చేసి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తే వర్తించే ప్రయోజనాలు, అందించే రుణ రాయితీల గురించి గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు స్త్రీనిధి సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, సత్తుపల్లి రూరల్, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలతోపాటు ఖమ్మం, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. ఒక్కో మండలం, మున్సిపల్ వార్డుల్లో 35 చొప్పున యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
సోలార్ యూనిట్లు పొందేందుకు లబ్ధిదారులు ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులై ఉండాలి. గ్రామ సమాఖ్యలకు బకాయిలేవీ ఉండకూడదు. వారి నివాసం కూడా ఆర్సీసీ బిల్డింగ్ అయి ఉండాలి. రెండు రూములు కలిగి ఉన్న భవనమై ఉండాలి. లబ్ధిదారులకు అందించే యూనిట్కు ఐదేళ్లు, సోలార్ ప్లేట్లకు 25 ఏళ్లు గ్యారంటీ ఉంటుంది.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో 2 కేవీ, 3 కేవీ రెండు రకాల యూనిట్లు ఉంటాయి. వీటిలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల మేరకు వారికి స్త్రీనిధి ద్వారా రుణసహాయం అందుతుంది. రెండు కిలోవాట్ల యూనిట్ వ్యయం రూ.1,42,200 కాగా అందులో రూ.39,200 రాయితీ లభిస్తుంది. రూ.లక్ష స్త్రీనిధి ద్వారా రుణసాయం అందుతుండగా లబ్ధిదారులు రూ.3 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 3 కిలోవాట్ల యూనిట్ వ్యయం రూ.1,92,360 కాగా అందులో రూ.57,360 రాయితీ లభిస్తుంది. స్త్రీనిధి ద్వారా రూ.1.25 లక్షల రుణం ఇస్తుండగా లబ్ధిదారులు రూ.10 వేలు చెల్లించాలి. 2 కిలోవాట్ల ప్లాంట్ ద్వారా రోజుకు 8 యూనిట్లు, 3 కిలోవాట్ల ప్లాంట్ ద్వారా రోజుకు 12 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు రోజుకు 5 నుంచి 6 యూనిట్లు మాత్రమే విద్యుత్ను వినియోగిస్తుంటారు. ఈ లెక్కన నెలకు 150 నుంచి 180 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తే మిగిలిన విద్యుత్ గ్రిడ్కు విక్రయించుకోవచ్చు. లబ్ధిదారులు తాము వినియోగించుకున్న విద్యుత్ పూర్తిగా ఉచితమే కాగా.. గ్రిడ్కు విక్రయించిన విద్యుత్తో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. లాభాలు ఆర్జించవచ్చు. రుణాన్ని ఐదేళ్లలోపు చెల్లిస్తే లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందడంతోపాటు యూనిట్ కూడా మిగులుతుంది. మిగులు విద్యుత్ను విక్రయించుకోవచ్చు.
సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నాక ‘రోజుకు ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? ఎంత వినియోగం అవుతుంది? గ్రిడ్కు ఎంత వెళుతుంది?’ అనే సమాచారాన్ని ‘నెట్మీటర్’ యాప్లో అప్లోడ్ చేయాలి ఉంటుంది. ఏవైనా రిపేర్లు వస్తే కంపెనీ ప్రతినిధులు వచ్చి మరమ్మతులు చేస్తారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారు నెలకు రూ.2,300, రూ.1.25 లక్షల రుణం తీసుకున్న వారు నెలకు రూ.2,800 చొప్పున 60 నెలల్లో స్త్రీనిధి సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెలకు రూ.1,000కి మించకుండా కరెంటు బిల్లు చెల్లించిన వారై ఉండాలి. లేదా 2 కిలోవాట్ల విద్యుత్ వాడకం ఉండాలి. ఇలాంటి వారినే ఎంపిక చేస్తారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే సోలార్ ప్లాంట్లు మంజూరు చేస్తారు. టీఎస్ రెడ్కో వీటిని ఏర్పాటు చేస్తుంది.
సోలార్ యూనిట్ల ఎంపిక కోసం గ్రామాల్లో స్త్రీనిధి సిబ్బంది ద్వారా అవగాహన కల్పించి లబ్ధిదారులను గుర్తిస్తున్నాం. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఖమ్మం జిల్లాలో ఆరు మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ఇప్పటివరకు 20 మంది మహిళలను గుర్తించాం. ఆసక్తి కలిగిన ఎస్హెచ్జీ గ్రూపు మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. -రవీంద్రనాయక్, స్త్రీనిధి రీజినల్ మేనేజర్, ఖమ్మం