కూసుమంచి (నేలకొండపల్లి), మార్చి 12: రోజూ వెళ్లి వచ్చే మార్గంలోనే కాపు కాచినట్లుగా ఓ ప్రమాదం జరిగింది. ఏపీలో మిర్చి ఏరేందుకు తెల్లవారుజామున ఐదు గంటలకే ఆటోలో బయలుదేరిన మహిళా కూలీలు ఆ తరువాత పది నిమిషాలకే ప్రమాదం బారిన పడ్డారు. చెరకుతోటలోంచి దూసుకొచ్చిన ఓ అడవి పంది వీరు ప్రయాణిస్తున్న ఆటో ముందు టైర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో వారిలో కొందరు గాయపడ్డారు. వారి హాహాకారాలతో ఆ రోడ్డు మార్గంలో అప్పటికే పొలాలకు వెళ్తున్న పలువురు రైతులు వచ్చి ఒక్కొక్కరినీ బయటకు తీశారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కిష్టాపురానికి చెందిన 15 మందికి పైగా మహిళా కూలీలు మిర్చి తోటలు ఏరేందుకు ఏపీ ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు వద్ద గల గోకినేనిపాలేనికి కొద్ది రోజులుగా ఆటోలో వెళ్లి వస్తున్నారు. మంగళవారం కూడా తెల్లవారుజామున ఐదు గంటలకు అదే ఆటోలో రోజూ మాదిరిగానే కిష్టాపురంలో బయలుదేరారు. ఆ ఆటో నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం సమీపంలోకి వచ్చింది. ఇంతలోనే ఆ రోడ్డు పక్కన ఉన్న చెరకుతోటలోంచి ఓ అడవి పంది ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చింది. నేరుగా ఆటో ముందు టైర్కు బలంగా తగిలింది. అప్పటికే ఆటో వేగంగా వస్తుండడం, డ్రైవర్ పక్కన మరో నలుగురు కూర్చొని ఉండడం వంటి కారణాలతో ఆ సమయంలో హ్యాండిల్ తిరగలేదు. దీంతో ఒక్కసారిగా ఆటో పల్టీ కొట్టింది.
ఆటోలోని కూలీలంతా ఒకరిమీద మరొకరు పడ్డారు. వారిలో కొందరికి ఆటో కడ్డీలు గుచ్చుకున్నాయి. ఆటో పల్టీ శబ్దం రావడం, మహిళల హాహాకారాలు విన్పించడంతో అప్పటికే అటుగా పొలాలకు వెళ్తున్న పలువురు రైతులు పరుగున వచ్చి చూశారు. ప్రమాదాన్ని గమనించి ఆటోలోని వారందరినీ బయటకు తీశారు. ఆ కూలీల్లో కిష్టాపురానికి చెందిన పెద్దపొంగు పార్వతి (45) అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను నేలకొండపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో స్థానికులు ఆమెను ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యం లోనే ఆమె మృతిచెందింది. అలాగే ఆ కూలీల్లోని రాధమ్మ, జ్యోతి, ఆరోగ్యం, నాగమ్మ, సునీత, నర్సమ్మకు తీవ్రగాలయ్యాయి. ఈలోపు నేలకొండపల్లి పోలీసులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను నేలకొండపల్లి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరు నేలకొండపల్లిలోనే చికిత్స పొందుతున్నారు. వారిలోనూ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై తోట నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.