ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 24: ఖమ్మం నగరంలో ఆరు పరీక్షా కేంద్రాల్లో బుధవారం ప్రశాంతంగా జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ (జేఈఈ) మెయిన్ బీఆర్క్ పరీక్ష జరిగింది. 1,071 మంది అభ్యర్థులకు 1,041 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల (సెషన్-2) వరకు పరీక్ష జరిగింది. పరీక్ష సమయానికి అరగంట ముందు నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించమనే నిబంధన అమలులో ఉండడంతో అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాల్లోకి వచ్చారు. కేంద్రాలను అబ్జర్వర్లు పర్యవేక్షించారు.
బొమ్మ కేంద్రంలో 100 మందికి 98 మంది, విజయ కేంద్రంలో 200 మందికి 195 మంది, శ్రీచైతన్య కేంద్రంలో 150 మందికి 145 మంది, ఎస్బీఐటీ కేంద్రంలో 281 మందికి 276 మంది, ప్రియదర్శిని కేంద్రంలో 250 మందికి 239 మంది, కవిత మెమోరియల్ కేంద్రంలో 90 మందికి 89 మంది హాజరయ్యారని పరీక్షల జిల్లా కో-ఆర్డినేటర్ రామసహాయం పార్వతీరెడ్డి తెలిపారు. .
ఈనెల 27 నుంచి వచ్చే నెల 1 వరకు ఆరు కేంద్రాల్లో జేఈఈ బీటెక్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు. అభ్యర్థులు కేవలం హాల్టికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను మాత్రమే కేంద్రాల్లోకి తీసుకురావాలి. పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్స్ పనిచేయకుండా జామర్స్ అమర్చి ఉంటాయి.