ఎర్రుపాలెం, జూలై 07 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సహకారంతో అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం తాసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వద్ద ఉన్న ఓటర్ల వివరాలను సంబంధిత బీఎల్ఓలకు అందజేసి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు, ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవగాహన కల్పిస్తూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిబంధనల మేరకు సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కె.సునీత, ఎలిజబెత్, ఆర్ఐలు రవి కుమార్, శ్రీషా, నాయకులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి, రాజీవ్ గాంధీ పాల్గొన్నారు.