కొత్తగూడెం సింగరేణి, మార్చి 3: సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తిలో ఫిబ్రవరి నెల చివరి వరకు లక్ష్యాన్ని సాధించలేక వెనుకబడి ఉంది. ఇప్పటివరకు కేవలం 81 శాతం మాత్రమే ఉత్పత్తి సాధించింది. ఫిబ్రవరి నెలకు నిర్దేశించుకున్న 64,78,800 టన్నులకు గాను 39,01,908 టన్నులు (60 శాతం) మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేసి సరిపుచ్చుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరిలో కూడా బొగ్గు ఉత్పత్తికి చాలా వెనుకబడి ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయని, అవి వెలుగులోకి రాకుండా గతంలో తప్పుడు లెక్కలు చూపెట్టేవారని, ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా చూపించడం వల్ల 60 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని కార్మిక సంఘాలు, కార్మికులు చర్చించుకుంటున్నారు.
ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి వివరాలు..
కొత్తగూడెం ఏరియాలో 1,51,000 టన్నులకు గాను 12,500 టన్నులు మాత్రమే (8 శాతం) బొగ్గు ఉత్పత్తి చేశారు. సత్తుపల్లి 11,85,000 టన్నులకుగాను 11,26,233 టన్నులు (95 శాతం), ఇల్లెందు 5,07,000 టన్నులకు 1,52,189 టన్నులు (30 శాతం), మణుగూరు 10,16,500 టన్నులకు 7,48,498 టన్నులు (74 శాతం) బొగ్గు ఉత్పత్తి చేశారు. బెల్లంపల్లి ఏరియాలో 3 లక్షల టన్నులకు 3,79,713 టన్నులు (126 శాతం), మందమర్రి 2,24,500 టన్నులకు 2,07,823 టన్నులు (93 శాతం), శ్రీరాంపూర్ 5,40,700 టన్నులకు 1,86,126 టన్నులు (34 శాతం) ఉత్పత్తి చేశారు. ఆర్జీ-1లో 3,71,300 టన్నులకు 1,47,275 టన్నులు (40 శాతం), ఆర్జీ-2లో 10,27,700 టన్నులకు 5,54,599 టన్నులు (54 శాతం), ఆర్జీ3 5,90,000 టన్నులకు 2,25,430 టన్నులు (38 శాతం) బొగ్గు ఉత్పత్తి చేశారు. ఆండ్రియాలా ప్రాజెక్టులో 1,43,700 టన్నులకు 16,662 టన్నులు (12 శాతం), భూపాలపల్లిలో 4,21,400 టన్నులకు 1,47,860 టన్నులు (35 శాతం) మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేశారు. మొత్తం సంస్థ వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు 64,78,800 టన్నులకు గాను 39,01,908 టన్నులు (60 శాతం) మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరిగింది.