కొత్తగూడెం సింగరేణి, జనవరి 26: సింగరేణి సంస్థ దేశాభివృద్ధికి బొగ్గు, థర్మల్ విద్యుత్ అందిస్తున్నని, ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా వచ్చే ఐదేళ్లలో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగసుతున్నదని సింగరేణి సీఎండీ శ్రీధర్ చెప్పారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం గణతంత్ర దిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ& సింగరేణి సంస్థ గత ఏడాది 26వేల కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారు. ఈ ఏడాది సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో 34వేల కోట్ల టర్నోవర్ సాధించే దిశగా ముందుకు దూసుకుపోతున్నదని తెలిపారు. మన దేశంలో విద్యుత్ వినియోగం నానాటికీ పెరుగుతున్నదని, ఈ కారణంగా బొగ్గుకు విపరీత డిమాండ్ ఏర్పడుతున్నదని వివరించారు. సింగరేణిలాంటి సంస్థకు ఇదొక సదవకాశమని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఐదేళ్లలో పది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సింగరేణి సంసిద్ధమైందని తెలిపారు.
ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా మరో మూడేళ్లలో విదేశీ బొగ్గు దిగుమతులకు స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా కోలిండియా, సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు 1200 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించిందని తెలిపారు. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా కొత్త బొగ్గు బ్లాక్లను కేటాయించిందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పాదనలో ఇప్పటికే 220 మెగావాట్ల ప్లాంట్లు పూర్తి చేశామని, మరో 800 మెగావాట్ల ప్లాంట్లను త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. సీనియర్ లా ఆఫీసర్ కొలిశెట్టి కౌశల్కు ఉత్తమ అధికారి, రామకృష్ణకు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందించి సన్మానించారు. అడ్వైజర్ (మైనింగ్) డీఎన్ ప్ర సాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె.ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేష్, జీఎం (మార్కెటింగ్) సూర్యనారాయణ, అడ్వైజర్ లక్ష్మణ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ పాల్గొన్నారు.
రాజ్యాంగ నిబంధనలు అమలు
సింగరేణిలో రాజ్యాంగ నిబంధనలను అమలు చేస్తున్నట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) చంద్రశేఖర్రావు అన్నారు. ప్రకాశం స్టేడియంలో గురువారం గణతంత్ర దిన వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం వెలుగులో, ప్రభుత్వాల నేతృత్వంలో కార్మిక సంక్షేమం, రక్షణ, పర్యావరణ సంరక్షణ తదితర చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్మిక సంక్షేమానికి సింగరేణి పెద్ద పీట వేస్తున్నదని అన్నారు. ఇప్పటికే సుమారు 50 వేల క్వార్టర్లు ఉన్నాయని అదనంగా మరో 643 క్వార్టర్ల నిర్మాణానికి అనుమతించామని అన్నారు.
కార్మికుల వైద్యం కోసం ప్రతి ఏటా సుమారు రూ.270 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిలో 29 శాతం, రవాణాలో 37 శాతం, టర్నోవర్లో 123 శాతం, లాభాల్లో 193 శాతం వృద్ధి సాధించిందని వివరించారు. పర్యావరణ హిత బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉత్తమ ఉద్యోగులు, అధికారులు, సింగరేణీయులను సన్మానించారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలోనూ వేడుకలు జరిగాయి. డైరెక్టర్లు బలరాం, సత్యనారాయణరావు, అధికారులు బసవయ్య, ఆనందరావు, నరసింహారావు, హన్మంతరా వు, ఎల్వీ గణపతి, బీవీ రావు, పిచ్చయ్య శాస్త్రి, నాయకులు బి.వెంకటరావు, శేషయ్య, వీవీ మధుకర్ పాల్గొన్నారు.
రామవరం, జనవరి 26: సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జయశంకర్ గ్రౌండ్లో జరిగిన వేడుకలో జాతీయ పతాకాన్ని జీఎం జక్కం రమేష్ ఎగురవేశారు. ఉత్తమ ఉద్యోగులు, అధికారులను సన్మానించి సర్టిఫికెట్లను అందించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు వాణీరమేష్, సభ్యులు ఫాతిమారజాక్, అధికారులు వీరన్న, నారాయణరావు, రఘురామిరెడ్డి, సూర్యనారాయణ, రవీందర్, శామ్యూల్ సుధాకర్, కోటిరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.