కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 14: సింగరేణీయులు 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలని, విధిగా విధులకు హాజరుకావాలని సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లలో సింగరేణికి సంబంధించినవి పెద్దగా లేవని, ఉన్నా అవి సంస్థ యాజమాన్యం తీర్చగలిగినవి కావని ప్రకటించారు. సింగరేణి పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు.
అలాంటప్పుడు సమ్మెలో పాల్గొనడం సమంజసం కాదన్నారు. సంస్థ వార్షిక లక్ష్యాలను ఛేదించాలని సంస్థ కోరుకుంటున్నదని, కానీ సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపులో కొంత వెనుకబడి ఉందన్నారు. వాటన్నింటినీ అధిగమించి లక్ష్యాలు ఛేదించాలంటే కార్మికుల సహకారం ఎంతో అవసరమన్నారు. కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తే సంస్థ సుమారు రూ.85 కోట్లు నష్టపోతారని, కార్మికులూ సుమారు రూ.18 కోట్ల వేతనాలు కోల్పోతారని స్పష్టం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కార్మికులు విధులకు హాజరుకావాలని కోరారు.