భద్రాచలం, ఫిబ్రవరి 16 : స్వామివారి ఆభరణాలకు సంబంధించి ఏటా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో వెండి ఇటుక మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. గురువారం తనిఖీలు చేపట్టిన దేవాదాయ ధర్మాదాయ శాఖ జ్యూవెల్లరీ వెరిఫికేషన్ అధికారి అంజని బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తర్వాత వెండి వస్తువులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేస్తుండగా.. ఆరు కేజీల వెండి ఇటుక ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉన్నా.. అది కనిపించలేదు. గతంలో రామాలయానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు విరిగిపోయినా..
రూపుమారినా.. నిరుపయోగంగా ఉన్న 50 కేజీల వెండిని హైదరాబాద్లోని మింట్లో కరిగించి 11 వెండి ఇటుకలుగా తయారు చేయించారు. ఇందులో నాలుగు ఇటుకలను దేవస్థానం అవసరాల కోసం వినియోగించగా.. మరో ఏడు ఇటుకలు ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆరు ఇటుకలు మాత్రమే కనిపిస్తున్నాయని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. దీనిపై దేవస్థానం ఈవో రమాదేవిని వివరణ కోరగా.. వెండి ఇటుక కనిపించకపోతే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తామని, ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని పేర్కొన్నారు.