మహా శివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం ఖమ్మం జిల్లావ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు, శివాలయాలు జనసంద్రంగా మారాయి. హరహర మహాదేవ.. శంభోశంకర, ఓం నమః శివాయ, ఓం నమో శివ రుద్రాయ అంటూ శివ నామస్మరణ మోర్మోగింది. ఖమ్మం రూరల్ మండలంలో తీర్థాల జాతరకు లక్షమందికి పైగా భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి, పితృదేవుళ్లకు పిండప్రదానాలు చేశారు. చింతకాని మండలం నేరడలోని అతి పురాతన శివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు పూజలు నిర్వహించారు. కాకతీయుల కాలంనాటి కూసుమంచి శివాలయంలో భక్తుల సందడి కనిపించింది. పెనుబల్లి మండలం శ్రీనీలాద్రీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.
ఖమ్మం పాండురంగాపురంలోని శ్రీ రామలిగేశ్వరస్వామి ఆలయానికి ప్రాతఃకాలం నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని శివయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. వీ వెంకటాయపాలెంలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం, కైకొండాయిగూడెం రోడ్డులోని శ్రీ విశాలక్షి సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయం, ధంసలాపురంలోని శ్రీ శంభులింగేశ్వర ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. అనేకమంది మహిళలు మంచినీళ్లు కూడా ముట్టకుండా, కనురెప్ప వాల్చకుండా ఉపవాసాలు, జాగరణ చేశారు.