‘కుల వృత్తులకు జీవం పోయాలె.. గొల్ల కురుమల జీవితాలు మారాలె.. బతుకు దెరువుకు వలసెళ్లినోళ్లు వాపస్ రావాలె.. ఉన్న ఊల్లెనే పని జేయాలె.. ఆర్థికంగా ఎదగాలె.. ఇంటిల్లిపాదీ మెతుకు తినాలె..’ అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఐదేండ్ల క్రితం ‘ 75శాతం రాయతీపై గొర్రెల యూనిట్ పంపిణీ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదటి విడతలో జీవాలను అందుకున్న లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగారు. తమ కుటుంబాలను నిలబెట్టుకున్నారు. పిల్లలను బాగా చదివిస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత యూనిట్ల పంపిణీకీ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఈ నెలాఖరు లోపు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నది.
-ఖమ్మం, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/
భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ)
ఖమ్మం, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ): గొల్ల, కురుమల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్ల క్రితం గొర్రెల యూనిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు లబ్ధిపొందాయి. ఉమ్మడి రాష్ట్రంలో సరైన ఉపాధి లేక ఇబ్బంది పడిన గొల్ల, కురుమలు కూలి పనులకు వెళ్లారు. కుల వృత్తిని విడిచి బతుకుదెరువుకు వలసలు వెళ్లారు. వారి కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ 75శాతం రాయితీపై గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. యూనిట్లు అందించడమే కాక జీవాలకు బీమా సౌకర్యం కల్పించారు. ప్రతి యూనిట్లో 20 జీవాలు, ఒక పొట్టేలు ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి గొల్ల, కురుమ వ్యక్తి పథకం లబ్ధి పొందేందుకు అర్హుడు. యూనిట్ను ఆశించి ప్రతిఒక్కరూ గొల్ల, కురుమల సొసైటీలో సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా తొలి విడతలో 15,584 మంది గొర్రెల యూనిట్లు (3,22 170 జీవాలు) పొందారు. రెండో విడతకు 16,180 మంది ఎంపికయ్యారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 7,511 మంది గొర్రెల యూనిట్లు పొందారు.
రెండో విడతకు 2,241 మంది ఎంపికయ్యారు. ఈ నెలాఖరులోపు అర్హులందరికీ యూనిట్లు అందనున్నాయి. గతంలో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు ఉండగా రెండోసారి యూనిట్ విలువ రూ.1.75 లక్షలకు పెరిగింది. తొలి విడతలో 75శాతం రాయితీ పోను లబ్ధిదారులు రూ.31,750 డీడీ చెల్లించారు. రెండో విడతకు యూనిట్ విలువ పెరిగినందున రూ.43,750 డీడీ చెల్లించారు. పశు సంవర్థకశాఖ అధికారులు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఇతర పొరుగు రాష్ర్టాలకు వెళ్లి మేలు జాతి గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఐదేండ్ల క్రితం యూనిట్ పొందిన వారి మంద ఇప్పటికి ఐదు రెట్లు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
పారదర్శకంగా యూనిట్ల పంపిణీ..
లాటరీ పద్ధతిలో ఎంపిక విధానం ఉంటుంది. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేదు. దళారుల ప్రమేయానికి ఆస్కారమే లేదు. గతంలో అధికారులు ఎక్కడ గొర్రెలు కొనుగోలు చేశారు.. అనే విషయం ముందుగానే తెలిసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. యూనిట్లు అందించే గంట ముందు మాత్రమే లబ్ధిదారులకు సమాచారం వెళ్తుంది. పశు సంవర్థకశాఖ నిర్ధారించిన యూనిట్ను మాత్రమే లబ్ధిదారుడు తీసుకోవాల్సి ఉంటుంది. జీవాలను లబ్ధిదారుడి ఇంటికి చేర్చే వరకు కాంట్రాక్టర్కు సొమ్ము అందదు.
జీవాల వైద్యం కోసం సంచార వాహనాలు..
జీవాలు అనారోగ్యానికి గురైతే సత్వరం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 108 తరహాలో 1962 టోల్ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. పశువుల యజమానులు ఒక్క కాల్ చేస్తే చాలు. సంచార పశు వైద్య వాహనం గ్రామానికి వస్తుంది. పశు వైద్యాధికారులు ప్రతి సీజన్లో జీవాలకు వచ్చే రోగాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.మా కుటుంబం నిలబడింది..
గొర్రెల పంపిణీ యూనిట్ అందించి రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబాన్ని నిలబెట్టింది. గొల్ల, కురుమల కోసం మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిట్ అందకముందు మేమంతా కూలి పనికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు బతుకులు మారాయి. సీఎం కేసీఆర్ వంటి నాయకుడితోనే సాధ్యమైంది. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చింది ఒక్క కేసీఆర్ మాత్రమే.
– బండి అప్పయ్య, గొర్రెల పెంపకందారుడు,
బొజ్జాయిగూడెం, ఇల్లెందు మండలం
ఆర్థికంగా ఎదిగాం..
సీఎం కేసీఆర్ దయతోనే మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నది. గొర్రెల పంపిణీ పథకం గొల్ల, కురుమలకు ఎంతో మేలు చేసింది. యూనిట్ ద్వారా మాకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందింది. జీవాలకు రోగాలేమైనా వస్తే వైద్యం చేయించేందుకు ప్రభుత్వం సంచార పశు వైద్య వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రమాదవశాత్తు జీవం మృతిచెందితే బీమా సౌకర్యం కల్పించింది. గొల్ల, కురుమల సంక్షేమం కోసం మంచి పథకాన్ని అమలు చేస్తున్న కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ముగాల భద్రయ్య, గొర్రెల పెంపకందారుడు, బొజ్జాయిగూడెం, ఇల్లెందు మండలం
వలసలు తగ్గాయి.
గొర్రెల పంపిణీ పథకం అమలు చేయకముందు గొర్రెల పెంపకందారులు కులవృత్తి విడిచి మరో పనికి వెళ్లేవారు. కొంతమంది వలసలు వెళ్లారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఎంతోమందికి యూనిట్లు అందాయి. ఇప్పుడు వారి జీవితాలు మారాయి. నాడు రాయితీపై ఇచ్చిన గొర్రెలు ఇప్పుడు వందల సంఖ్యలో పెరిగాయి. ప్రస్తుతం గొర్రెలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మేం కష్టపడి మేపినందుకు మాకు తగిన ఫలితం వస్తున్నది.
– తోట పెద్ద అప్పారావు, పెంపకందారుల సొసైటీ అధ్యక్షుడు, కాచిరాజుగూడెం, ఖమ్మం రూరల్ మండలం
అరెకరం భూమి కొన్నా..
నాకు ఐదేండ్ల క్రితం నా వద్ద ఐదారు గొర్రెలే ఉండేవి. వాటిని పెంచుతూ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉండేది. నాకు గొర్రెల పంపిణీ యూనిట్ మంజూరైంది. 21 గొర్రెల యూనిట్ను తీసుకున్నా. ఇప్పుడు జీవాల సంఖ్య రెట్టింపైంది. గొర్రెలను పెంచి, పెద్ద చేసి, అమ్మి నేను అరెకరం భూమి కొన్నా. ఇంటి అవసరాలు తీర్చుకోవడం, శుభకార్యాలు జరపించడమంతా గొర్రెలు అమ్మిన సొమ్ముతోనే కానిచ్చేశాం. మాలాంటి పేదలవారి కోసం సీఎం కేసీఆర్ మంచి పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం రెండో విడతకు ఒక్క మా గ్రామం నుంచే 118 మంది ఎంపికయ్యారు.
– మొర్రిమేకల నాగేశ్వరరావు, వీరమ్మ, గొర్రెల పంపెకందారులు, కాచిరాజుగూడెం, ఖమ్మం రూరల్ మండలం
మేమే స్వయంగా వెళ్లి ఎంపిక చేసుకున్నం
సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తూ గొల్ల కురుమలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో యూనిట్లను మంజూరు చేయడంతో అందరం కలిసి గొర్రెలు మేపుకుంటున్నాము. గతంలో గొర్రెలు కనిపించేవి కావు. నేడు ఎక్కడచూసినా మందలకు మందలే కనిపిస్తున్నాయి. పంపిణీలో అక్రమాలు జరగకుండా మేమే స్వయంగా వెళ్లి గొర్రెలను ఎంపిక చేసుకున్నాం. దీంతో మాకు ఆరోగ్యకరమైన గొర్రెలను కొనుగోలు చేసే అవకాశం దొరికింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
– కొత్తపల్లి నర్సింహారావు, లబ్ధిదారుడు, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం
కేసీఆర్కు రుణపడి ఉంటాం..
గొల్ల, కురుముల కష్టాలను గుర్తించి మా కోసం గొర్రెల పంపిణీ యూనిట్లు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలుకావడం లేదు. కులవృత్తులకు అండగా నిలిచింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటాం. రాష్ట్రంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆ పథకాలే కేసీఆర్ను మూడోసారి సీఎంను చేస్తాయి. కేసీఆర్ వెంటే మేము నడుస్తాం.
– దాసరి లింగమల్లు, శ్రీరామ గొర్రెల పెంపకందారుల సొసైటీ అధ్యక్షుడు, టేకులపల్లి మండలం
భార్యాభర్తలిద్దరం గొర్రెలు కాస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం మాకు గొర్రెల యూనిట్లు మంజూరు చేసింది. భార్యాభర్తలిద్దరం గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. వీటివల్ల వచ్చే ఆదాయంతో ఆదర్శంగా ఉన్నాం. తెలంగాణలో అద్భుతమైన గొర్రెల పంపిణీ పథకాన్ని కేసీఆర్ అమలు చేయడం గొప్ప విషయం. గొల్ల కురుమల కుటుంబాలకు గొర్రెల యూనిట్లు ఆర్థికంగా భరోసానిచ్చాయి.
– కొప్పుల చెన్నారావు, లబ్ధిదారుడు, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం
రోజూ కేసీఆర్ను తలుచుకుంటా..
సీఎం కేసీఆర్ మా కుటుంబాలు బాగుపడాలని గొర్రెల యూనిట్లు ఇస్తున్నారు. పథకంలో భాగంగా మా కుటుంబానికీ గొర్రెల యూనిట్ అందింది. మందను చూసినప్పుడల్లా నాకు కేసీఆరే సారే గుర్తొస్తారు. ప్రతిరోజూ ఆయన్ను గుర్తుతెచ్చుకుంటా. మందలో పొట్టేలు ఎంత బలంగా ఉంటుందో రాజకీయాల్లో కేసీఆర్ అంతటి బలమైన నేత.
– మహేష్, గొర్రెల పెంపకందారుడు, ప్రేగళ్లపాడు,
టేకులపల్లి మండలం