ఖమ్మం సిటీ, మార్చి 29 : కడుపులో ఎదుగుతున్న ఆడబిడ్డను పిండ దశలోనే చిదిమేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి రాకముందే భ్రూణ హత్య చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల అకృత్యాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ‘ఆడబిడ్డలు పుట్టి ఎందుకు..?’ అనే అమానవీయ ఆలోచనతో కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, యాజమాన్యం అడిగినంత సొమ్ము చేతిలో పెట్టి గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. భ్రూణ హత్యలకు తెగబడుతున్నారు. ఈ పనులన్నింటికీ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ఎక్కడా పోస్టింగ్ దొరకని వైద్యులను కన్సల్టెంట్లుగా పెట్టుకుంటున్నట్లు, ల్యాబ్ నిర్వాహకులు కడుపులో పిండం ప్లస్ (మగ) లేదా మైనస్(ఆడ) అని.. ప్రత్యేక కోడ్ భాషలో గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు తెలుపుతున్నట్లు తెలుస్తున్నది. గర్భంలో పెరుగుతున్నది ఆడశిశువు అని తెలిస్తే ఇక అబార్షన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వైద్యారోగ్య శాఖ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే గర్భిణుల వివరాలను వైద్యులు, సిబ్బంది రికార్డుల్లో సమగ్రంగా పొందుపరచాలి. ప్రసవం జరిగినా, ముఖ్యంగా సి-సెక్షన్ ఆపరేషన్ అయితే అందుకు గల కారణాలను జిల్లా అధికారులకు నివేదించాలి. ఖమ్మంలో భ్రూణ హత్యలు, అబార్షన్లకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో గర్భిణులకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ఉండవు. ఒక్కో అబార్షన్కు యాజమాన్యాలు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గురువారం రాత్రి ట్రైనీ ఐఏఎస్ యువరాజ్, ట్రైనీ ఐపీఎస్ మౌనిక, డీఎంహెచ్వో డాక్టర్ బి.మాలతి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సైదులు నగరంలోని చర్చి రోడ్డులోని ఓ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అక్కడ ఒక్కచోటే దాదాపు 50 మంది గర్భిణులకు అబార్షన్లు చేయడాన్ని గుర్తించారు. వీరిలో ఐదుగురు మహిళల గర్భస్థ శిశువులను తొలగించడం గమనార్హం.
వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేటు ఆసుపత్రులపై అరకొర నిఘా వేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన ఆసుపత్రి యాజమాన్యాలపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ‘దొరికితేనే దొంగ.. లేకపోతే దొర..’ అన్న చందాన ఆసుపత్రి యాజమాన్యాల అక్రమాలు నడుస్తున్నాయి. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం చట్టవ్యతిరేకంగా గర్భిణులకు అబార్షన్లు చేస్తుంటే వైద్యారోగ్య శాఖ చొరవతో పోలీసులు ఆ ఆసుపత్రి అధినేతను అరెస్ట్ చేశారు. కొంతకాలం తర్వాత సదరు నిందితుడు బయటకు వచ్చి తిరిగి అదే చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నాడు. ఇలాంటి తూతూమంత్రపు అరెస్టులు నగరంలో ఎన్నో జరుగుతున్నాయి. తిరిగి షరా మామూలే అన్నట్లుగా వైద్యులు అబార్షన్ల పబ్బం గడపుకొంటూనే ఉన్నారు. నగరంలోని ఆసుపత్రులకు పొరుగు జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గర్భిణులు వస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ మార్గం పట్టిన వైద్యులు, సిబ్బంది భ్రూణ హత్యలు చేసి శిశువులను చిదిమేస్తుంటే, ఆ అమానుషాన్ని ఆపాల్సిన వైద్యారోగ్య శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కలెక్టర్ ఖమ్మం వీపీ గౌతమ్, సీపీ సునీల్ దత్ చొరవ తీసుకుని భ్రూణ హత్యల నివారణపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వాములను చేసి ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది. పట్టుబడిన ఆసుపత్రి అధినేతలపై హత్యానేరం మోపి కఠిన శిక్షలు విధిస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదనే ప్రజాభిప్రాయం వ్యక్తమవుతున్నది.
గర్భస్థ లింగ నిర్ధారణ, సరైన కారణం లేకుండా అబార్షన్లు చట్టరీత్యా నేరం. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడతాం. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిపై వైద్యారోగ్య శాఖ నిఘా ఉంటుంది. నిబంధనలు అతిక్రమించి ఒక్కసారి పట్టుబడిన ఆసుపత్రి యాజమాన్యాలకు భవిష్యత్లో అనుమతులు ఇవ్వబోం. నిఘాకు అవసరమైతే పోలీసు శాఖను సమన్వయం చేసుకుంటున్నాం. నిబంధనలు ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించం. భ్రూణ హత్యల నివారణలో ప్రజలు, పార్టీలు, సంఘాల సహకారం అవసరం.