ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 15: సైన్స్ లేకుండా జీవితం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, డీఈవో సామినేని సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజల్లో ఇంకా పాదుకొన్ని ఉన్న మూఢ నమ్మకాలు పోవాలని అన్నారు. మానవ మనుగడ అంతా సైన్స్తోనే ముడిపడి ఉందని స్పష్టం చేశారు. దేశానికి ప్రయోజనం చేకూర్చే ఫలితాలు సాధించాలంటే ప్రయోగాలు నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో మూడురోజులపాటు జరిగిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రదర్శన ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సృష్టించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మారుతున్న సమాజానికి అనుగుణంగా ఆవిష్కరణలు రూపొందించాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు. చదివిన అంశాలను ప్రాక్టికల్స్ రూపంలో ప్రదర్శించినప్పుడే అవి ఎక్కువకాలం గుర్తుంటాయని వివరించారు. ఈ సందర్భంగా ఇన్స్పైర్కు సంబంధించి 15 కమిటీల ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం రా్రష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఈ ప్రక్రియకు డీఈవో సామినేని సత్యనారాయణ అధ్యక్షత వహించారు. డీఎస్వో సైదులు, అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, డీసీఈబీ సెక్రటరీ నారాయణ, ప్రైవేట్ స్కూల్స్ ప్రతినిధి టైనిటాట్స్ భాస్కర్, శ్రీవాణి రాంచందర్రావు, అభినవ్ రమణ, వండర్ కిడ్స్ శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యార్థుల సత్తా..
రాష్ట్ర స్థాయికి ఎంపికైన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఇన్స్పైర్ వేదికగా విద్యార్థుల ప్రదర్శనలో స్పష్టమైంది. 23 ప్రాజెక్టుల్లో 10 ప్రాజెక్టులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులవే కావడం గమనార్హం. ఇన్స్పైర్లో ఏడు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా అందులో ఐదు ప్రాజెక్టులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులవి. రెండు ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులవి.
రాష్ట్ర స్థాయికి 23 నమూనాలు..
జిల్లా స్థాయిలోని 583 ప్రదర్శనల్లో 23 నమూనాలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. కరోనా అనంతరం తొలిసారిగా నిర్వహించిన ఈ ప్రదర్శనలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అంశంలోని ఉప అంశాల ఆధారంగా సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.