తల్లాడ, డిసెంబర్ 23: మండలంలోని అన్నారుగూడెం కాటన్ పార్కులోని బయోఫార్మసీ ఫ్యాక్టరీలో అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేసిన ఔషధ నిల్వలను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజవర్ధనాచారి, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డీసీ అధికారులు బయో ఫార్మసీ ఫ్యాక్టరీలో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 935 కిలోల డ్రగ్స్ పౌడర్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీపీ రెహమాన్, సీఐ సాగర్ పాల్గొన్నారు. అక్రమ ఔషధ డ్రగ్స్ తయారీ సూత్రదారి సతీశ్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.