భద్రాద్రి కొత్తగూడెం. ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : భద్రగిరి కొండకు కల్యాణ శోభ సంతరించుకుంది. సీతారామచంద్రస్వామి కల్యాణానికి మిథిలా ప్రాంగణం ముస్తాబవుతోంది. పావన గౌతమీ తీరం రామయ్య కల్యాణానికి వచ్చే భక్తులను పునీతం చేయడానికి సిద్ధమైంది. భద్రాచలం కొండపై కొలువై ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవానికి ముహూర్తపు ఘడియలు సమీపిస్తున్నాయి. ఈ నెల 17న జానకిరాముల పరిణయం, 18న రామయ్య పట్టాభిషేకం ఉత్సవాల క్రతువును వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఎండోమెంట్ కమిషనర్ హనుమంతురావు, దేవస్థానం ఈవో రమాదేవి తదితరులు.. కల్యాణతంతు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కలెక్టర్ ప్రియాంక కూడా ప్రత్యేక దృష్టిసారించి ఇప్పటికే రెండుసార్లు సమీక్షించారు. రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు దేశవ్యాప్తంగా అశేష సంఖ్యలో భక్తులు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లతోపాటు లడ్డూ ప్రసాదాలు, తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. కాగా, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దివ్యక్షేత్రంలో 1999, 2011, 2023లో పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా.. ఈసారి సీతారామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
జానకరాముల కల్యాణం జరిగే మిథిలా ప్రాంగణాన్ని అధికారులు 26 సెక్టార్లుగా విభజించారు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఈసారి ప్రజాప్రతినిధులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 26 సెక్టార్ల ద్వారా భక్తులు కల్యాణాన్ని తిలకించడానికి 15,860 టిక్కెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్లో ఉంచారు. మరో 15 వేలకు పైగా భక్తులు ఉచితంగా కల్యాణం తిలకించనున్నారు. మొత్తంగా 40 వేల మంది భక్తులు కల్యాణం తిలకించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు, ఆ తరువాత దేవతామూర్తులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు కూడా వస్తుంటారు. కల్యాణానికి ముందు, ఆ తరువాత రెండు మూడు రోజులపాటు వీరు అక్కడే ఉండి సేదదీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశాయి.
సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. భద్రగిరికి వచ్చే భక్తులతోపాటు కల్యాణాన్ని వీక్షించేందుకు రాలేని భక్తులకు కూడా అధికారులు వీటిని అందించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి రాష్ర్టానికి చెందిన పలువురు భక్తులు గోటి తలంబ్రాలను అందజేశారు. అంతా కలిపి దేవస్థానం అధికారులు 200 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇవి అందించనున్నారు. అలాగే, 2 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచారు. నవమి రోజున తలంబ్రాలకు 60 కౌంటర్లు, లడ్డూలకు 19 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే, స్వాగత తోరణాలు, విద్యుత్ కాంతులతో భద్రాచలం పట్టణాన్ని, దేవస్థానాన్ని అలంకరించారు. ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల్లో కూడా స్వాగత శ్రీరామనవమి స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ముందస్తు సమాచారం కోసం పౌరసంబంధాల శాఖ జిల్లా వ్యాప్తంగా 25 చోట్ల సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. కల్యాణం జరిగే మిథిలా స్టేడియం, పార్కింగ్, తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు, టాయిలెట్లు, స్నానఘట్టాలు తదితర వివరాలు తెలిపేలా రూట్మ్యాప్ను కూడా సిద్ధం చేశారు. కొత్తగూడెం బస్టాండ్, రైల్వేస్టేషన్, కిన్నెరసాని, భద్రాచలం టోల్గేట్లతోపాటు భద్రాచలం పట్టణంలోని అన్ని పాంతాల్లోనూ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సీతారాముల కల్యాణాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించేందుకు కలెక్టర్ ప్రియాంక అధికారులకు ప్రత్యేక విధులకు కేటాయించారు. తాగునీటి సమస్యపై ఆ శాఖ ఏఈలను ఇన్చార్జులుగా నియమించారు. 200 కుళాయిలను అందుబాటులో ఉంచారు. అలాగే, కల్యాణ క్రతువును భక్తులు కనులారా తిలకించేందుకు 6 ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. గోదావరి వద్ద బారికేడ్లను ఏర్పాటుచేసి 200 మంది ఈతగాళ్లను, 135 కంట్రీ బోట్లను సిద్ధంగా ఉంచారు. అలాగే, 26 సెక్టార్లలో సెక్టారుకు ప్రత్యేక అధికారిని, 25 జోన్లలో పారిశుధ్య కార్మికులను నియమించారు. ప్రతీ జోన్కు ఎంపీవోతోపాటు నలుగురు కార్యదర్శులను ఉంచారు. 08743-232444 నంబరుతో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమును అందుబాటులో ఉంచారు.
భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలుగకుండా ఏర్పాట్లు చేశాం. కల్యాణం, పట్టాభిషేకం, సెక్టార్లు, వసతి సౌకర్యాల కోసం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చాం. భక్తులు వాటి ద్వారా తమకు కావాల్సిన సర్వీసులను ముందస్తుగానే బుక్ చేసుకోవచ్చు. నదీ తీరంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాం. వంతెనపై వాహనాలు నిలిచిపోతే క్లియర్ చేసేందుకు క్రేన్లు సిద్ధం చేశాం. అత్యవసర వైద్యం కోసం ఏరియా ఆసుప్రతిలో 20 బెడ్లను అందుబాటులో ఉంచాం. భక్తులందరూ విచ్చేసి రామయ్య కల్యాణాన్ని కనులారా వీక్షించి వెళ్లొచ్చు.