భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రెండేళ్ల కరోనా తర్వాత భక్తుల సమక్షంలో జరిగే ముక్కోటి ఉత్సవాలను తిలకించి తరించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించి ఉత్సవాలు విజయవంతం చేయాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుతోపాటు పటిష్టంగా బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 28న జిల్లాలో రాష్ట్రపతి పర్యటన ఉన్నందున అన్ని ఏర్పాట్లూ చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా జనవరి 1న సాయంత్రం తెప్పోత్సవం, 2వ తేదీన ఉత్తరద్వార దర్శనం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్లుగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయం చుట్టూ పార్కింగ్ను అనుమతించకూడదని, అందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి సూచిక బోర్డులు పెట్టాలని సూచించారు. ముక్కోటికి ఏటా లక్ష మందికి పైగా భక్తులు దర్శనానికి వస్తుంటారని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలంలో పర్యటించనున్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భద్రత, వసతి, వైద్యం సహా ఇతర ఏర్పాట్ల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కలెక్టర్, ఎస్పీ స్వయంగా వీటిని పర్యవేక్షణ చేయాలని సూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, లెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, ఏఎస్పీ రోహిత్రాజు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈవో శివాజీ తదితరులు పాల్గొన్నారు.