భద్రాద్రి కొత్తగూడెం, మే 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎవరూ కంటి సమస్యతో బాధపడకూడదు.. ప్రతిఒక్కరి కళ్లలో వెలుగులు నిండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నది. గతంలో నిర్వహించిన మొదటి విడత ‘కంటి వెలుగు’ గ్రాండ్ సక్సెస్ కావడంతో సర్కార్ మరోసారి శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో రెండో విడత శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కంటి సమస్య ఉండి 18 సంత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ శిబిరాలకు వెళ్లి ఉచితంగా చికిత్స పొందుతున్నారు. శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. నయాపైసా ఖర్చు లేకుండా నిమిషాల్లో వైద్యపరీక్షలు చేయించుకుని అనంతరం తమ పనులకు తాము వెళ్తున్నారు.
సమీప ప్రాంతాల్లోనే..
జిల్లావైద్యారోగ్యశాఖ అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి సమీప ప్రాంతాల్లోనే కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో శిబిరాన్ని సుమారు 10 రోజుల పాటు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 50 బృందాలు 50 చోట్ల శిబిరాలు నిర్వహిస్తున్నాయి. వేసవి దృష్ట్యా అధికారులు ప్రజల కోసం శిబిరాల వద్ద తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. వైద్యబృందాలను శిబిరాల వద్దకు చేర్చేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.
నిరంతరం కొనసాగుతున్న సేవలు..
ఈ ఏడాది జనవరి 19న రెండోవిడత కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమైంది. గురువారానికి 77 రోజులు పూర్తయ్యాయి. వైద్యసిబ్బంది ఇప్పటివరకు 4,19,133 (మహిళలు- 2,21,924 మంది, పురుషులు- 1,97,055 మంది, ఇతరులు-35)మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో 86,906 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందించారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్న 52,071 మందికి ప్రత్యేక కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. వీరిలో ఇప్పటికే 38,034 మందికి ఇంటికి వెళ్లి మరీ కళ్లద్దాలు అందించారు. ఇప్పటివరకు 397 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 107 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు విజయవంతమయ్యాయి. అధికారులు, కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్న ప్రాంతాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు.
కొద్దిరోజుల్లోనే కళ్లద్దాలు..
నేను కొద్దిరోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్నాను. ఇంతలో ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నదని తెలిసి మా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి వెళ్లాను. వైద్యనిపుణులు వైద్యపరీక్షలు నిర్వహించి నాకు కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. కొద్దిరోజుల్లోనే నాకు కళ్లద్దాలు అందజేశారు. ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– చేతుల తిరపతమ్మ, శాంతినగర్ వాసి, టేకులపల్లి మండలం
విజయవంతంగా శిబిరాలు..
భద్రాద్రి జిల్లాలో విజయవంతంగా కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నాం. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతిచోటా శిబిరాలు నడుస్తున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎవరికైనా కంటి సమస్య చిన్నదైతే వెంటనే రీడింగ్ కళ్లద్దాలు ఇస్తున్నాం. కంటి సమస్య తీవ్రంగా ఉంటే అందుకు తగిన కళ్లద్దాలను ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నాం. కేవలం కొన్నిరోజుల్లోనే ప్రజలకు కళ్లద్దాలు అందజేస్తున్నాం.
– డాక్టర్ శిరీష, డీఎంహెచ్వో, కొత్తగూడెం
పావుగంటలో సమస్యకు పరిష్కారం..
కొద్దిరోజులుగా నేను కంటి సమస్యతో బాధపడుతున్నాను. ఉదయం 10 గంటలకు మా ప్రాంతంలోని కంటి వెలుగు శిబిరానికి వెళ్లాను. అక్కడి వైద్య సిబ్బంది ఆధార్ కార్డు అడిగారు. ఇచ్చాను. వైద్యనిపుణురాలు కొన్ని అక్షరాలు చూపించి వాటిని గుర్తుపట్టమన్నారు. నాకు కొన్ని అక్షరాలు వాస్తవ సైజు కంటే చిన్నగా కనిపించాయి. వైద్యులు నాకు రీడింగ్ గ్లాసెస్ అవసరమని గుర్తించి వెంటనే అందించారు. పావుగంటలో నా సమస్య తీరింది. అనంతరం నా పనికి నేను వెళ్లిపోయాను.
– ఎస్కే అజ్గర్, పెనగడప వాసి, చుంచుపల్లి మండలం