దుమ్ముగూడెం, డిసెంబర్ 17: దుమ్ముగూడెంలోని సీఎస్ఐ ఎలిమెంటరీ పాఠశాల. దాదాపుగా 50 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ బడి భవనం శిథిలావస్థకు చేరింది. అందులో తరగతుల నిర్వహణ క్షేమకరం కాకపోవడంతో, దానిని స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించారు. ఈ పాఠశాలలోని కేవలం ఒక గదిలో ఎలిమెంటరీ పాఠశాలను నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఆనవాళ్లు కోల్పోయిన ఆ ఎలిమెంటరీ పాఠశాలలో ఎంతోమంది పలకాబలపం పట్టుకుని ఓనమాలు దిద్దుకున్నారు, అక్కడే మొట్టమొదటిసారిగా పుస్తకం పట్టుకున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అలా అక్కడ.. అప్పుడెప్పుడో 42 ఏళ్ల క్రితం (1980లో) ఐదోతరగతి పూర్తిచేసిన ఆ ఆరుగురు సహాధ్యాయులు.. తమ మనసు పొరల్లో ఆనాటి బాల్యపు బడి రూపాన్ని ఇప్పటికీ అలాగే చెక్కుచెదరకుండా పదిలపర్చుకున్నారు..! తమ బాల్యపు బడి శిథిలావస్థకు చేరడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఆ బడి గోడల మధ్య.. ఆనాడు చదువుకున్న గుర‘జాడ’ గేయపు పంక్తులు..
‘సొంత లాభం కొంత మానుకు.. పొరుగు వానికి తోడుపడవోయ్’
గుర్తుకొచ్చాయేమో..! ‘సొంత ఖర్చులు కొంత మానుకు.. బడి బాగుకు తోడుపడవోయ్’ అంటూ బాల్యపు గుర్తులు కర్తవ్యాన్ని నిర్దేశించినట్టున్నాయ్. ముందుకు నడిపించినట్టున్నాయ్. అంతే.. ఆ ఆరుగురూ కలిసి రంగంలోకి దిగారు. తమ చిన్నప్పటి బడిని సొంత ఖర్చులతో పునఃనిర్మించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా శనివారం జేసీబీ తీసుకొచ్చి పనులు ప్రారంభించారు.
ఫిబ్రవరి నాటికి బడి భవనాన్ని నిర్మించాలని, వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధం చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఇంతకీ, ఆ ఆరుగురు అ‘పూర్వ’ విద్యార్థులు ఎవరంటే.. ఎండీ.జానీపాషా (బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి), కొర్రపాటి సూర్యప్రకాష్రావు (హైదరాబాద్), డేగల ఇమ్మానుయేల్ (హైదరాబాద్), ఐసెట్టి శంకర్రావు (దుమ్ముగూడెం), చిట్టిమళ్ల విద్యాసాగర్ (గంగోలు),అన్నెం సత్యనారాయణ మూర్తి (బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు). బడి పునర్నిర్మాణ పనుల మొదటి రోజున వీరితోపాటు బీఆర్ఎస్ మండల కార్యదర్శి కణితి రాముడు, నాయకుడు కుప్పిలి చిట్టిబాబు జత కలిశారు. ఈ అ‘పూర్వ’ విద్యార్థుల్లాగా.. ప్రతి ఒక్కరూ చేయీ చేయీ కలిపి, తమ బాల్యపు బడి బాగుకు కంకణబద్ధులైతే.. ఎంత బాగుంటుందో కదా..!