తల్లాడ, జూన్ 26: మహనీయుల త్యాగాలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు. మండలంలోని తెలగవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్రాం విగ్రహాలను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకుడు ఏపూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. దేశానికి రిజర్వేషన్లు అందించి అన్ని వర్గాలకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించిన అంబేద్కర్ అందరి వాడని అన్నారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగాలని సూచించారు. విద్య, వైద్యంతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. సత్తుపల్లిలో రూ.25 లక్షలతో అంబేద్కర్ కాంస్య విగ్రహంతోపాటు జగ్జీవన్రాం విగ్రహాలను తాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహనీయుల విగ్రహాలను గ్రామాల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంపీవో శ్రీదేవి, సర్పంచ్ తేల్లూరి కృష్ణయ్య, యూడీసీ చైర్మన్ మువ్వా మురళీధర్రావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ కేతినేని చలపతిరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.