పెనుబల్లి, మార్చి 15: దిశా నిర్దేశం లేని వ్యక్తులతో తిరుగుతున్న కొందరు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రావాలని సవాల్ విసిరారు. బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వల్లపు రామకృష్ణతోపాటు గంగదేవిపాడుకు చెందిన మరో 36 మంది బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు మందా రవి, కొత్త ప్రసాద్ ఆధ్వర్యంలో లంకపల్లికి చెందిన 15 కుటుంబాల వారు ఎమ్మెల్యే సండ్ర సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు.
మండలంలోని గంగదేవిపాడులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు నివాసంలో వారందరికీ సండ్ర గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లను విమర్శించే స్థాయి ఎవరికీ లేదని సష్టం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రెండు సార్లూ ఓడిపోయిన ఆ వ్యక్తి.. రెండుసార్లూ కేసీఆర్ కేబినేట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ పదవిని అనుభవించాడని అన్నారు.
ఆ విశ్వాసమూ లేకుండా ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తనకు ఎలాంటి దురలవాట్లు, వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూసంపుడి మహేశ్, శ్రీనివాసరెడ్డి, మోహన్రావు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, లగడపాటి శ్రీను, ప్రసాద్, కోట ప్రభాకర్, కనగాల సురేశ్బాబు, గోల వెంకటరెడ్డి, దొడ్డపునేని రవి తదితరులు పాల్గొన్నారు.