వేంసూరు, డిసెంబర్ 2: రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలందరికీ టీఆర్ఎస్ సర్కారు అండగా ఉంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని గుర్తుచేశారు. మండలంలోని దుద్దేపూడి, భరిణెపాడు, కందుకూరు, వెంకటాపురం, అమ్మపాలెం, కుంచపర్తి, చిన్నమల్లేల, జయలక్ష్మీపురం, శంభునిగూడెం గ్రామాల్లో 35 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 28 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తన సొంత ఖర్చుతో 35 మందికి చీరెలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. పేద కుటుంబాల్లో ఆడ పిల్లల వివాహాల కోసం రూ.1,00,116ను సాయంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. అనంతరం జయలక్ష్మీపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అమ్మపాలెంలో ఉచిత ఎంపీడీ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, పుచ్చకాయల శంకర్రెడ్డి, ముజాహిద్, రంజిత్కుమార్, వాసు, ప్రకాశ్, మిరియాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.