సారపాక/బూర్గంపహాడ్, ఫిబ్రవరి 14 : ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు రాజకీయ, పలుకుబడి కలిగిన నాయకుల అండదండలతో లారీల ద్వారా ఇసుకను రవాణా చేసి సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్కు నిత్యం వందలాది లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా.. సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సారపాక, బూర్గంపహాడ్ మండలాల పరిధిలో టీఎస్ఎండీసీ, మైనింగ్, పోలీసు అధికారులు మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 22 లారీలకు పైగా ఇసుకను తరలిస్తూ పట్టుబడినట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం 17 లారీలపైనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నా.. అక్రమార్కులు రూటు మార్చి హైదరాబాద్కు వివిధ మార్గాల ద్వారా రాత్రికి రాత్రే తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన ఆంధ్రా సరిహద్దు గుండాల ర్యాంపు నుంచి సుమారు 22 లారీల్లో ఇసుకను లోడ్ చేసుకుని భద్రాచలం బ్రిడ్జి మీదుగా సారపాక నుంచి హైదరాబాద్కు తరలించే క్రమంలో పై మూడు శాఖల అధికారులు మెరుపుదాడి చేసి లారీలను పట్టుకున్నారు.
అయితే లారీ డ్రైవర్లకు ముందస్తుగా సమాచారం అందడంతో సారపాకకు వచ్చిన తర్వాత యార్డు వద్ద, బీపీఎల్ స్కూల్, పుష్కరవనం, మణుగూరు క్రాస్ రోడ్, సందెళ్ల రామాపురం, లక్ష్మీపురం యార్డు, పెట్రోల్ బంకు ప్రాంతం ఇలా.. ఎక్కడి లారీలు అక్కడే వదిలేసి పారిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా వ్యవహరిస్తూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు. కాగా.. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి టీఎస్ఎండీసీ పీవో పసుపులేటి శ్రీనివాస్ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాపై గస్తీ ముమ్మరం చేశాం. మూడు రోజులుగా ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి మైనింగ్, పోలీసు శాఖల సహకారంతో దాడులు చేస్తున్నాం. మంగళవారం రాత్రి ఆంధ్రాలోని గుండాల ర్యాంపు నుంచి లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న ముందస్తు సమాచారంతో దాడులు చేసి సుమారు 17 లారీలను పట్టుకుని వాటిని పోలీస్స్టేషన్లో అప్పగించాం. ఇదిలా ఉండగా.. మొత్తం 22 లారీలు ఉన్నాయని ‘నమస్తే’ ప్రశ్నించగా.. రాత్రి సమయంలో చెట్లమాటున కొన్ని లారీలను నిలిపినట్లు తర్వాత తెలిసిందని, వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామని వివరణ ఇచ్చారు. పట్టుబడిన లారీలకు సంబంధించి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.