ఖమ్మం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండునెలలు కావస్తున్నా ఇసుక తవ్వకాలు, రవాణాపై నిర్ధిష్ట నూతన విధానాన్ని రూపొందించకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అనేక క్వారీల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణదారులు, గుత్తేదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్న ఇసుకను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇసుక దందా మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలు అన్న చందంగా విరాజిల్లుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి గనులు దోపిడీకి గురికాకుండా గత కేసీఆర్ ప్రభుత్వం నూతన మైనింగ్ విధానాన్ని అమలుచేసింది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇసుక క్వారీల్లో తవ్వకాలను నిలిపివేసింది. ఖమ్మం జిల్లాలో ఇసుకకు ప్రధాన వనరుగా ఉన్న మున్నేరు, కట్టేలేరు, వైరానదిలో నిబంధనల ప్రకారం తవ్వకాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక క్వారీల నిర్వహణను నిలిపివేయడంతో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో వ్యాపారులు జిల్లాలో అందుబాటులో ఉన్న ఇసుక క్వారీల్లో అక్రమ రవాణాకు తెరలేపారు. అధికార పార్టీ అండతో మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీల చందంగా వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జిల్లా సరిహద్దుగా ఉన్న మధిర నియోజకవర్గం ప్రాంతాల గుండా ఖమ్మం నగరానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లాలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మైనింగ్ అధికారులతో టాస్క్ఫోర్స్ కమిటీని గత ప్రభుత్వం నియమించింది. అయితే ఆ కమిటీని ప్రస్తుత అధికారులు అటకెక్కించినట్లు కనిపిస్తున్నది. ఏదేమైనా ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖనాజాకు భారీ నష్టం వాటిల్లుతున్నది.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పోలీస్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో కలెక్టర్ ఆదేశాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాం. అక్రమ రవాణాపై ప్రజలు వెంటనే పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
అనుమతులు తీసుకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా ముదిగొండ, ఎర్రుపాలెం, బోనకల్, మధిర, తల్లాడ, చింతకాని మండలాల్లో ఇప్పటికే 22 ఇసుక క్వారీలను ఆయా మండలాల తహసీల్దార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించడంతోపాటు ప్రైవేటు కట్టడాలకు కూడా ఈ ఇసుకను సీనరేజ్ చెల్లించి వినియోగించాల్సి ఉంది. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో నదుల్లో ఉన్న ఇసుకను అనుమతులు లేకుండానే అక్రమంగా రాత్రివేళల్లో వందల ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ప్రధాన ఇసుక వనరుగా ఉన్న ముదిగొండ మండలంలోని గంధసిరి, పెద్దమండవ, చింతకాని మండలంలోని చిన్నమండవ గ్రామాల పరిధిలో ఉన్న మున్నేరు నుంచి రాత్రి పదిగంటల తర్వాత కొన్ని వందల ట్రాక్టర్లతో ఇసుకను ఖమ్మం తరలించి ఖమ్మంరూరల్ మండలంలోని కరుణగిరి ఎదురుగా ఉన్న వెంచర్లు, నివాసాల మధ్య, నగరంలోని దానవాయిగూడెం వెళ్లే బైపాస్ బ్రిడ్జి ప్రాంతంలో నిల్వ పెట్టుకుని విక్రయిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అండతో అక్రమంగా వ్యాపారులు ఇసుకను ఆంధ్రా నుంచి ఇక్కడికి తరలించి జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బోనకల్ మండలంలో 7 టిప్పర్లు, ముదిగొండ మండలంలో 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే వెంటనే జరిమానాలు కట్టి విడిపించుకున్న వ్యాపారులు తిరిగి అదే అక్రమ రవాణాను ప్రారంభించారు. అధికారులు చిత్తశుద్ధితో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.