కూసుమంచి, జనవరి 1 : యాసంగికి తగినంత జలాలు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని 17 మండలాల పరిధిలో 2,54,274 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. ఆయకట్టుకు సాగునీరు అందించే పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఎగువ నుంచి జలాలు రాకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. గత వానకాలంలో సాగునీరు ఇవ్వలేమని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపినప్పటికీ రైతులు సుమారు 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. వారబందీ ప్రకారం అందిన నీటి వరకు సద్వినియోగం చేసుకుని పంటలను కాపాడుకున్నారు. కానీ.. యాసంగిలో మాత్రం సాధారణ పంటలకు బదులు కేవలం ఆరుతడి పంటలు పండించే అవకాశం కనిపిస్తున్నది. రైతులు కేవలం బోరు బావులపైనే ఆధారపడే పరిస్థితి నెలకొన్నది.
కర్ణాటకలో ఈ ఏడాది తక్కువ వర్షపాతం కురవడంతో ఆల్మట్టితో ఇతర ప్రాజెక్ట్లూ జలకళను కోల్పోయాయి. దీంతో కృష్ణా ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. యాసంగికి కావాల్సిన మేర జలాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న జలాలను తాగునీటి అవసరాలకు వినియోగించాలని ఇరిగేషన్ అధికారులు యోచిస్తున్నారు. దేవులపల్లి, పాలేరు, వైరా వంటి రిజర్వాయర్ల నుంచి తాగునీటి అవసరాలకు నీటి వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తున్నది. సాగర్ ఎడమ కాలువపై ఆధారపడి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 6,40,000 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉన్నది. ఆయకట్టులో రైతులు యాసంగి సాగు చేపట్టాలంటే కనీసం 50 టీఎంసీల నీరు కావాల్సి ఉన్నది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అంత నీరు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ మేరకు ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సర్కార్కు నివేదికలు సైతం అందించారు. దీంతో మొదటి జోన్ వరకైనా నీరు వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఇక పాలేరు రిజర్వాయర్ నుంచి కల్లూరు వరకు ఉండే రెండో జోన్ ఆయకట్టు రైతుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు.
11 సంవత్సరాల కిందట ఒకసారి సాగునీటి కొరత వచ్చింది. అప్పుడు కేవలం ఏడాదిలో వానకాలంలో మాత్రమే పంటలకు జలాలు అందాయి. యాసంగికి నీటి కొరత వచ్చింది. ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో వర్షపాతం లేకపోవడంతో కృష్ణా జలాలు మన వరకు రాలేదు. తిరిగి మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. వానకాలం అరకొరగా పంటలకు నీరందగా యాసంగికి నీటి ఎద్దడి ఏర్పడింది.
సహజంగా ఏటా జూన్ మొదటి వారం నుంచి కేరళ నుంచి వచ్చే రుతుపవనాలు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్నినో కారణంగా బలహీనపడ్డాయి. వానల రాక ఆలస్యమైంది. దీంతో తెలుగు రాష్ర్టాల్లో వానకాలం సాగు వెనుకబడింది. ఆ ప్రభావం యాసంగి సాగుపైనా పడింది. కృష్ణా ఆయకట్టుకు సాగుజలాల కొరత ఏర్పడింది.
పాలేరు రిజర్వాయర్కు ఈసారి శ్రీరాం సాగర్ జలాలే రక్షగా కనిపిస్తున్నాయి. సుమారు 360 కి.మీ దూరం నుంచి ఇరిగేషన్ అధికారులు పొరుగు జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లా పరిధిలోని బయ్యారం చెరువు అలుగు వరకు జలాలను తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా బయ్యన్న వాగు నుంచి పాలేరుకు శ్రీరాంసాగర్ జలాలను తరలించి గత సీజన్లో పంటలను కాపాడారు. ఈసారి నీటి ఎద్దడి ఎదురైతే ఈ తరహాలోనే మరోసారి జలాలు తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు.
నాకు 8 ఎకరాల భూమి ఉంది. వానకాలం సాగర్ నీరు రాకపోవడంతో 5 ఎకరాల్లో పత్తి వేశా. బోర్ కింద మూడు ఎకరాల్లో వరి వేశా. సాగర్ జలాలు వస్తే మొత్తం 8 ఎకరాల్లో వరి వేసేవాడిని. ఈసారి యాసంగికి పత్తి చెడగొట్టి మక్క వేద్దామనుకొంటున్నా. సాగర్లో నీరు లేకపోవడం వల్ల వరికి నీరందే పరిస్థితి లేదు. దీంతో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని నిర్ణయించుకున్నాం.
నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఇం దులో ఏటా వరి పండించేవాడిని. కానీ.. ఈసారి సాగర్ నీరు రాకపోవడంతో పొలం వేయకుండా ఇతర పం టలు వేశాం. యాసంగికి కూడా నీరు రాదని తెలిసింది. ఇంకా ఏ పంట వేయాలని నిర్ణయించుకోలేదు. వానకాలానికే నీరు రాలేదు. యాసంగికి నీరు రాదని తెలుస్తోంది. ఇతర పంటలు వేయాలనుకొంటున్నాం.