కర్షకుల పెట్టుబడి కష్టాలు తీరాయి. పంట సాగు కోసం ఇప్పుడు ఆలి మెడలో పుస్తెలు అమ్మాల్సిన పనిలేదు. ఎరువులు, విత్తనాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయాల్సిన పనిలేదు. అప్పులు తెచ్చి వడ్డీలకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు.. అన్నదాతల పెట్టుబడి రందీ తీర్చేందుకు సీఎం కేసీఆర్ ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి అయ్యింది. తొలుత ప్రభుత్వం సీజన్కు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇచ్చింది. రెండేళ్ల తర్వాత సీజన్కు మరో రూ.వెయ్యి పెంచింది. దీంతో రైతులకు సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున సొమ్ము అందుతున్నది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 1,33,174 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. గడిచిన ఐదేళ్లలో పది సీజన్లకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం మొత్తం రూ.1,723 కోట్లు జమ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, మే 11 (నమస్తే తెలంగాణ) : ‘రైతులు పెట్టుబడి కోసం మిత్తి వ్యాపారులను ఆశ్రయించొద్దు.. వడ్డీలకు వడ్డీలు కట్టొద్దు.. అప్పుల పాలై రైతు కుటుంబం రోడ్డున పడొద్దు.. దర్జాగా వ్యవసాయం చేసుకోవాలి.. లాభాలు ఆర్జించాలి..’ అన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతుబంధు పథకం అమలుకు మంగళవారానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. రైతు పక్షపాతిగా వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వీటిలో రైతుబంధు పథకం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచే పథకం. 10 మే 2018న ఈ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలైంది. తొలుత ప్రభుత్వం సీజన్కు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇచ్చింది. రెండేళ్ల తర్వాత సీజన్కు మరో రూ.వెయ్యి పెంచింది. దీంతో రైతులకు సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున సొమ్ము అందుతున్నది. పథకం ప్రారంభించిన తొలినాళ్లలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,10,299 మంది రైతులు లబ్ధి పొందారు. ప్రస్తుతం పథకం ద్వారా లబ్ధిపొం దుతున్న రైతుల సంఖ్య 1,33,174 మందికి చేరింది.
రైతుల ఖాతాల్లో రూ.1,723 కోట్లు..
గడిచిన ఐదేళ్లలో పది సీజన్లకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం మొత్తం రూ.1,723 కోట్లు జమ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో రైతులకు సాయం అందించినది. కేవలం కేసీఆర్ ప్రభుత్వమే అని వేరే చెప్పనక్కర్లేదు. పథకం ప్రారంభమైన ఏడాదిలో జిల్లాకు చెందిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రెండు సీజన్లకు కలిపి రూ.260 కోట్లు జమ కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.405 కోట్లు జమ అయింది. అంటే.. ఐదేళ్లకు రైతులకు అందిన సొమ్ము సుమారు రెట్టింపు అయినట్లు లెక్క. ఇలా ఐదేళ్లలో రైతుల ఖాతాలో జమ అయిన మొత్తం రూ.1,723 కోట్లు. పథకం ఆరంభంలో పథకం ద్వారా లబ్ధిపొందిన రైతుల సంఖ్య 1,10,299 ఉండగా ఇప్పుడా సంఖ్య 1,33,174 కు చేరింది.
సాగు పండుగ..
గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అని రైతులను పట్టించుకోలేదు. సాగుపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. రైతులు ఇక కాడి వదిలేద్దామా.. అని భావిస్తున్న సమయంలో స్వరాష్ట్రం వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉద్యమ నేత సీఎం కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. రైతు పక్షపాతిగా మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడిక తీయించారు. కరకట్టలను పటిష్టం చేశారు. వాగులు, నదులపై వీలున్న ప్రతిచోటా చెక్డ్యాంలు నిర్మించారు. సాగునీటి ప్రాజెక్ట్లు నిర్మించారు. సాగు జలాలను మాగాణికి పారిస్తున్నారు. రైతురుణమాఫీ అమలు చేశారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకువచ్చారు. పట్టా ఉన్న ప్రతి రైతుకూ రైతుబీమా పథకం వర్తింపజేశారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నారు. రైతుబంధు ద్వారా రైతుల పెట్టుబడి కష్టాలు తీర్చారు. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. దీంతో రాష్ట్రంలో సాగు పండుగ అయింది. గత ప్రభుత్వాలకు చెంపపెట్టులా వ్యవసాయం తెలంగాణలో విప్లవమైంది. దేశమంతటికీ అన్నపూర్ణగా నిలిచింది.
ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం..
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతుబంధు రైతులకు ఆర్థిక భరోసానిస్తున్నది. ఏటా సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతున్నారు. గతేడాది యాసంగిలో 1,74,475 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయగా ఈ యాసంగిలో ఏకంగా 2,15,463 ఎకరాల్లో సాగు చేయడం విశేషం. గతంతో పోలిస్తేవ విస్తీర్ణం ఏటికేడు పెరుగుతున్నది. మరోవైపు పండించిన పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉండడం, మక్కలు, ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడంతో రైతులు ధీమాగా ఉన్నారు.
రకరకాల పంటలు..
రైతులకు ఆర్థిక వెసులుబాటు ఉండడంతో ఇప్పుడు సంప్రదాయ పంటలే కాక ప్రత్యామ్నాయ పంటలూ పండిస్తున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 35,759 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగు చేయగా ప్రస్తుతం ఆ విస్తీర్ణం 52,296 ఎకరాలకు చేరుకున్నది. ఆయిల్పాం రైతులు అంతర పంటలు సాగు చేసి కూడా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కూరగాయలు, పండ్ల తోటల పెంపకమూ నానాటికీ పెరుగుతున్నది.
రైతుబంధుతో భరోసా..
నాకు ఏటా రెండు సీజన్లలో రైతుబంధు సొమ్ము అందుతున్నది. గతంలో పంట పెట్టుబడులకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవాడిని. ఐదేళ్ల నుంచి అదునుకు ముందే రైతుబంధు అందుతుండడంతో అప్పుల బాధ తప్పింది. రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతుబంధు మాకు భరోసానిచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు మాకు అండగా నిలుస్తున్నారు. పంటల సాగు విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు.
– షేక్ అబ్దుల్ అలీం, రైతు, తిప్పనపల్లి, చండ్రుగొండ మండలం
దర్జాగా వ్యవసాయం..
రైతుబంధు సొమ్మును సద్వినియోగం చేసుకుని రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. సొమ్ముతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నారు. ఏఈవోలు ఎప్పటికప్పుడు కొత్తగా పట్టాలు పొందిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. వారికి పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే వాటికి పరిష్కారం చూపుతాం
– కొర్సా అభిమన్యుడు, డీఏవో, కొత్తగూడెం
రైతుల పాలిట దేవుడు కేసీఆర్..
రైతుల సంక్షేమం కోసం ఆలోచించే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం అదృష్టం. రైతులకు ఎలాంటి బాధ రానీయకుండా చక్కగా చూసుకుంటున్నారు. రైతుల పాలిట దేవుడయ్యాడు. రైతులకు మంచి చేస్తున్న ఈ ప్రభుత్వం పదికాలాల పాటు చల్లగా ఉండాలి. తెలంగాణ వచ్చిన తర్వాతే రైతులకు మేలు జరిగింది. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు.
– ముత్యాల సత్యనారాయణ, రైతు, కోయగూడెం, టేకులపల్లి మండలం