అశ్వారావుపేట రూరల్, మే 8 : రాష్ట్ర గురుకుల పాఠశాల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తామని చేతల్లో చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల మేథస్సు పెంచేందుకు తెలంగాణలో హైదరాబాద్ వేదికగా కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీ వరకు ఆలిండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రానికి చెందిన ఇంటి రోషిత ఈ టోర్నమెంట్లో సత్తాచాటి రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంక్, జాతీయస్థాయిలో 400వ ర్యాంక్ సాధించింది. అశ్వారావుపేటకు చెందిన ఇంటి రోషిత స్థానిక ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నది. 1 నుంచి 5వ తరగతి వరకు సూర్య పబ్లిక్ స్కూల్లో చదివి ఎంట్రన్స్ రాసి సీటు సాధించింది. 6వ తరగతి విద్యనభ్యసిస్తున్న సమయంలో ఆ స్కూల్ పీఈటీ ప్రమీల రోషిత ప్రతిభను గుర్తించారు.
ఈమెకు ఖాళీ సమయాల్లో చెస్లో మెళకువలు నేర్పుతూ మార్చిలో ఖమ్మంలో జరిగిన చెస్ టోర్నమెంట్కు ప్రోత్సహించారు. ఈ టోర్నమెంట్ ఉభయ జిల్లాల విద్యార్థులకు నిర్వహించగా రోషిత 2వ ర్యాంక్ సాధించింది. జిల్లా టోర్నమెంట్లో రాణించడంతో పీఈటీ ప్రమీల రోషితకు హైదరాబాద్లో 20రోజులు శిక్షణ ఇప్పించారు. అనంతరం తెలంగాణ సోషల్ అండ్ ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీ వరకు జరిగిన తెలంగాణ గురుకుల ఆలిండియా ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. దీనిలో 15 రాష్ర్టాల నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 9 రౌండ్స్ జరగగా 4 పాయింట్స్తో జాతీయస్థాయిలో రోషిత 400వ ర్యాంక్ సాధించింది. రాష్ట్రస్థాయిలో 40 మంది పాల్గొనగా 8వ ర్యాంక్, ఉభయ జిల్లాస్థాయిలో 15 మంది విద్యార్థులు పాల్గొనగా 2వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా రోషిత మాట్లాడుతూ 9, 13, 14, 15 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలతో చెస్ ఆడినట్లు తెలిపింది. ర్యాంక్ మెమెంట్ను మంత్రుల చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉందని, ప్రిన్స్పాల్ సంగీత, పీఈటీ ప్రమీల ప్రోత్సాహం మరువలేనిదన్నారు. అమ్మ స్వరూప, నాన్న మునిబాబు ఎంతో ధైర్యపరిచి ప్రోత్సహించినట్లు తెలిపింది.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
మా పాప రాష్ట్ర, జాతీయస్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ చూపడానికి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలే కారణం. పీఈటీ ప్రమీల, ప్రిన్సిపాల్ సంగీత రోషితను చదువు, చెస్లో ఎంతగానో ప్రోత్సహించారు. మా కుటుంబం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటుంది. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.
– స్వరూప, రోషిత తల్లి