ఖమ్మం రూరల్, మే 01 : హింస నిరోధంలో స్థానిక నాయకత్వం పాత్ర చాలా కీలకమని ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శివనాదుల శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఖమ్మం రూరల్ మండల పరిషత్ కార్యాలయం నందు సర్పంచులు, ఉప సర్పంచులు, స్థానిక నాయకులకు “సామాజిక నాయకత్వం, స్థానిక ప్రభావశీలు హింస నిరోధంలో నాయకుల పాత్ర ” అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో హింస అనేది అందరి జీవితాలను దెబ్బ తీస్తోందన్నారు. సమాజాన్ని మార్చడానికి, సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
గ్రామాలలో, కాలనీలలో హింస నిరోధానికి స్థానిక న్యాయకత్వం ముందంజలో నిలబడాలన్నారు. వారు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి మహిళలు, పిల్లల హక్కుల గురించి చెప్పాలన్నారు. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, బానిసత్వ కార్మికుల సమస్యలపై ఎన్జీఓలు, స్థానికులు కలిసి పోరాడాలని, గ్రామ ప్రథమ పౌరులుగా హింసను తిరస్కరించి ముందుకు సాగాలన్నారు. సమాజంలో ఐక్యత సృష్టించాలి – గ్రామ సభలు, సమావేశాలలో చర్చలు నిర్వహించి తెలియజేయాలి. డయల్ 100, సైబర్ నేరాల కోసం 1930 లాంటి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ఐ జ్యోతి, ఏ హెచ్ టి యు – భాస్కర్, ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ కానిస్టేబుల్ రుక్మిణి, మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు.