ఉమ్మడి రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేక పల్లెలు అల్లాడిపోయాయి. సాగు, తాగు నీరు లేక ప్రజలు అరిగోస పడ్డారు. గ్రామాలకు సరైన రహదారులు లేక అష్టకష్టాలు పడ్డారు. వర్షాలు పడితే వాగులు ఉప్పొంగి ప్రవహించి కొన్ని పల్లెలకు రాకపోకలు బంద్ అయ్యేవి. మోకాళ్ల లోతు బురదలో ప్రయాణాలు సాగించేవారు. కానిప్పుడు స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నది. మారుమూల పల్లెలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం రహదారులు నిర్మిస్తుండడంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతున్నది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనున్నది. వివిధ గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిధులు విడుదల చేయించారు. నియోజకవర్గంలో మొత్తం 35.70 కిలోమీటర్ల మేర 13 రహదారులకు రూ.17.83 కోట్లు మంజూరయ్యాయి. దీంతో గిరిజనులు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అశ్వారావుపేట, నవంబర్16 : అశ్వారావుపేట నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనున్నది. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో కొన్ని గ్రామాల గిరిజనులు తమ సమస్యను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన ఐటీడీఏ అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. ఆ ప్రతిపాదనలను ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణానికి గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిధులు విడుదల చేయించారు. నియోజకవర్గంలో మొత్తం 35.70 కిలోమీటర్ల మేర 13 రహదారులకు రూ.17.83 కోట్లు మంజూరయ్యాయి. దీంతో గిరిజనులు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించారు. సంక్షేమ పథకాలకు దీటుగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన విద్య, వైద్యంతోపాటు రహదారి సౌకర్యం కల్పించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా మారుమూల గ్రామాలకూ రోడ్లు నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ మండలాలకు రూ.17.83 కోట్లు కేటాయించింది. ఐదు మండలాల్లో 35.70 కిలోమీటర్ల మేరకు కొత్తరోడ్లు నిర్మించేందుకు 13 రోడ్లను మంజూరు చేశారు.
ఫలించిన ఎమ్మెల్యే కృషి
ఎమ్మెల్యే మండలాల పర్యటనలో భాగంగా రోడ్ల దుస్థితిని గిరిజనులు ఎమ్మెల్యే మెచ్చా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించి ఆయన ఐటీడీఐ అధికారులను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలను ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి రోడ్లు మంజూరుకు ఆదేశించడంతో గిరిజన సంక్షేమశాఖ రోడ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నియోజవర్గంలో రోడ్లు మంజూరు కావడంతో గిరిజనులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు రుణపడి ఉంటామని గిరిజనులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు
రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. మారుమూల గ్రామాలకూ రవాణా సౌకర్యం కల్పించేందుకు పక్కా రోడ్డు నిర్మిస్తాం.
– మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే