బోనకల్లు, ఫిబ్రవరి 20 : బోనకల్లు మండల కేంద్రంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. ఇక్కడి రహదారులపై రాకపోకలు సాగించడం ప్రమాదభరితంగా ఉంటోంది. తరచూ ప్రమాదాలు జరుగుతుండడమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. మండల కేంద్రంలోని జంక్షన్లో రింగ్ నిర్మాణం లేకపోవంతో దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు తికమకపడుతున్నారు. కొందరు వాహనదారులు అధిక వేగంతో వెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిల్లో ఎక్కువగా బాటసారులు గాయపడుతున్నారు. జంక్షన్ వద్ద రింగ్ నిర్మాణం లేకపోవడం, కూడలి సూచికలు, వేగ నిరోధకాలు నిర్మించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక రైల్వే ఓవర్ బ్రిడ్జి తీరు కూడా అదేవిధంగా ఉంది. ఆర్వోబీకి మెట్లు లేకపోవడంతో ప్రయాణికులు ప్రమాదభరితంగా రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది.
తెలంగాణ ఆంధ్రా రోడ్డు మార్గంలో బోనకల్లు రహదారి ప్రధానమైనది. బోనకల్లు మండల కేంద్రంలో 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వేగేటును తొలగించింది. రూ.26 కోట్లతో ఆర్వోబీ నిర్మించింది. దానికి ఇరువైపులా అప్రోచ్రోడ్లు కూడా ఏర్పాటు చేసింది. కానీ ఈ మార్గంలోని నాలుగు రహదారులను కలిసే జంక్షన్లో మాత్రం రింగ్ ఏర్పాటు చేయడాన్ని మరిచింది. ఇదే ఇప్పుడు అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ రోడ్డు మార్గంలో బోనకల్లు నుంచి ఒకరోడ్డు, వైరా నుంచి బ్రిడ్జి మీదుగా మరొక రోడ్డు, ఖమ్మం నుంచి ఇంకొక రోడ్డు, జగ్గయ్యపేట నుంచి వేరొక రోడ్డు వచ్చి ఇక్కడ కలుస్తుంటాయి. 24 గంటలూ రద్దీగా ఉండే ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. నాలుగు కూడళ్లు కలిసే ఈ ప్రాంతంలో ఆర్అండ్బీ అధికారులు రింగ్ను నిర్మించలేదు. దూర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చే వాహనదారులు ఎటువైపున ఏ మార్గానికి మళ్లాలో తెలియక తికమకపడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్నిసార్లు కొన్ని వాహనాలు ఎదురెదురుగా వచ్చే క్రమంలో ఒకే మార్గంలోకి వెళ్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
వైరా నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్లే మార్గంలో వాహనాలు అతివేగంగా వస్తుంటాయి. ఆ సమయంలో బోనకల్లు నుంచి, ఖమ్మం నుంచి వచ్చే వాహనాలు ఆదమరిస్తే ప్రమాదాలు సంభవించినట్టే లెక్క. ఇంతటి ప్రమాదకరమైన ప్రదేశంలో కూడలి నిర్మించకపోవడంతో వాహనాల వేగాన్ని నిరోధించే అవకాశం లేకుండాపోతోంది. దీంతో వాహనాలు ఢీకొని బాటసారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఆర్వోబీ వద్ద కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్న రైల్వేగేటును అప్పటి అధికారులు తొలగించి ఓవర్ బ్రిడ్జి నిర్మించడంతో ఇక్కడి ప్రజలు ఆనందపడ్డారు. సౌకర్యంగా ఉంటుందని సంబురపడ్డారు కానీ తరువాత వారికి నిరాశే మిగిలింది. రైల్వేట్రాక్పై ఆర్వోబీ నిర్మించిన అధికారులు దానికి మెట్లు మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో ఆర్వోబీపై వాహనాలు సులభంగానే వెళ్తున్నా పాదచారులకు మాత్రం ప్రయాస తప్పడం లేదు. దీంతో వారు ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో రైలు పట్టాలు దాటి రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాక్ దాటే క్రమంలో కొన్నిసార్లు అతివేగమైన రైళ్లు వస్తూపోతూ ఉంటాయి. ఇక్కడ వృద్ధులు పట్టాలు దాటాలంటే మరింత ప్రమాదకరంగా ఉంటోంది. అయితే ఈ ప్రాంతంలో ట్రాక్ దాటుతూ అనేకమంది మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.