భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రారంభించిన ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కొత్తగూడెం రానున్నారు. బస్సు యాత్ర ద్వారా వస్తున్న ఆయన.. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రసంగిస్తారు. గులాబీ దళపతి బస్సు యాత్ర, రోడ్ షోల విజయవంతం కోసం బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్ని ఏర్పాట్లూ చేశారు. బస్సు యాత్ర ద్వారా వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, సుజాతనగర్ మీదుగా కొత్తగూడెం చేరుకోనున్న కేసీఆర్.. కొత్తగూడెం పట్టణంలో రోడ్ షోలో పాల్గొంటారు.
పోస్టాపీస్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్ మీదుగా ఈ రోడ్ షో కొనసాగుతుంది. అదేరోజు రాత్రి పాల్వంచ పట్టణంలో బస చేయనున్నారు. కాగా, గులాబీ బాస్ రోడ్ షోలో పాల్గొనేందుకు, ఆయన ప్రసంగాన్ని ఆసాంతం వినేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ బస్సు యాత్ర, రోడ్ షోలలో ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, మదన్లాల్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.